Vijayawada: మరికొద్ది గంటల్లో అమెరికా ప్రయాణం..ఇంతలోనే యువతి దుర్మరణం

Vijayawada NRI loses life in accident
షార్ట్స్‌లో చూడండి
మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి కారులో హైదరాబాద్‌కు వస్తుండగా శనివారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరణం పద్మా నాయుడు కుటుంబం అమెరికాలో స్థిరపడింది. వారి స్వస్థలం విజయవాడ. ఇటీవల వారి బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు పద్మా నాయుడు కుమార్తె ప్రీతి వచ్చారు. శనివారం ఆమె తన బంధువులతో కలిసి హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరారు.

చీకటిగూడెం శివారు వద్ద ప్రీతి ప్రయాణిస్తున్న కారును సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో.. కారు రోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రీతి అక్కడిక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న దొప్పలపూడి శ్రేయాస్, కారులో ప్రయాణిస్తున్న చేకూరి సరిత, దివి విశ్వవిఖ్యాత్, దివి పద్మావతిలకు గాయాలయ్యాయి. ప్రీతి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిని అదే ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని కేతేపల్లి పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Vijayawada

More Telugu News