KVP Ramchara Rao: కేంద్రం ‘ఎత్తు’లకు తలొగ్గి రాష్ట్రానికి ద్రోహం చేయొద్దు: జగన్‌కు కేవీపీ లేఖ

  • పోలవరం ఎత్తును 140 అడుగులకు తగ్గించేందుకు కేంద్రం యత్నిస్తోందన్న కేవీపీ
  • ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకరించొద్దని సూచన
  • ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్నానన్న కేవీపీ
KVP Writes Letter To YS Jagan On Polavaram Project

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోన్‌రెడ్డికి రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఘాటు లేఖ రాశారు. పోలవరం విషయంలో కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి ద్రోహం చేయొద్దని కోరారు. పోలవరం ఖర్చును తగ్గించుకునేందుకు రిజర్వాయర్ ఎత్తును 140 అడుగులకు కుదించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు అంగీకారం తెలపొద్దని సీఎంకు నిన్న రాసిన లేఖలో సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రం చేతిలోనే ఉందని, కాబట్టి ఎత్తు తగ్గించాలంటూ కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా తిప్పి కొట్టాలని కోరారు. 

ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు, భూసేకరణ, పునరావాసం, నిధులను బూచిగా చూపి ఎత్తు పెంచకుండా కేంద్రం ప్రయత్నం చేయొచ్చని అన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు, ప్రయత్నాలకు తలొగ్గి ఎత్తు తగ్గించేందుకు అంగీకరించకుండా, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి రాష్ట్ర ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్నట్టు కేవీపీ ఆ లేఖలో పేర్కొన్నారు.  ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖర్చు బాధ్యత కేంద్రానిదేనని, ప్రాజెక్టు ఎత్తు కుదించి, ఖర్చు తగ్గించేలా కేంద్రం వేసే ఎత్తులకు అంగీకరించవద్దని జగన్‌ను కోరారు.

More Telugu News