Telangana: తెలంగాణ వాసులకు చల్లని కబురు.. 16 తర్వాత వర్షాలు!

  • తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఆవరించిన ద్రోణి
  • సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
  • హైదరాబాద్‌లో నిన్న 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Rains Expected In Telangana After 16th

వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులకు ఇది చల్లని కబురే. ఈ నెల 16 నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించింది. దీనికి తోడు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. 

ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఈ నెల 16 తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో నిన్న కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది 2.6 డిగ్రీలు తక్కువ.

More Telugu News