Gudivada Amarnath: కడుపు మంటతో రాసిన లేఖ.. గంటాపై గుడివాడ అమర్ నాథ్ మండిపాటు

  • గతంలో దావోస్ కు వెళ్లి టీడీపీ నేతలు ఎన్ని పెట్టుబడులు తెచ్చారని గుడివాడ అమర్ నాథ్ ప్రశ్న
  • దావోస్ కు వస్తున్న ప్రతినిధులనే తాము రాష్ట్రానికి తీసుకొస్తున్నామని వ్యాఖ్య 
  • ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపణ
Gudivada Amarnath fires on ganta srinivasa raos letter

వైసీపీ సర్కారును ప్రశ్నిస్తూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేసిన లేఖపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. దావోస్ వెళ్లి తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. ఆ లేఖ గంటా శ్రీనివాసరావు రాసినట్టు లేదని, చంద్రబాబు రాసిన లేఖపై గంటా సంతకం పెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కడుపు మంటతోనే రాసిన లేఖలా కనిపిస్తోందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచన చేసినట్లు లేదన్నారు. 

అసలు ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని అమర్ నాథ్ ఆరోపించారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. ‘‘10 ఏళ్లకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. కానీ చంద్రబాబు పారిపోయి వచ్చారు. రాజధాని లేదని ఎలా అంటారు. వాళ్లకు మాట్లాడే అర్హతే లేదు’’ అని మండిపడ్డారు. 

దావోస్ కు వెళ్లడం, అక్కడ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల గురించి చెప్పుకోవడం కాదని, దావోస్ కు వస్తున్న ప్రతినిధులనే రాష్ట్రానికి తీసుకొస్తున్నామని, ఏది గొప్ప? అని అమర్ నాథ్ ప్రశ్నించారు. కనీసం 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతకుమించి 5 లక్షల కోట్లు వస్తాయా? లేక 10 లక్షల కోట్లా? అనేది ఇన్వెస్టర్లను బట్టి ఉంటుందన్నారు.

More Telugu News