Tata Group: 'బిస్లరీ వాటర్' కొనుగోలుపై వెనక్కి తగ్గిన టాటాలు!

  • బిలియన్ డాలర్లను డిమాండ్ చేస్తున్న బిస్లరీ ప్రమోటర్
  • అంత విలువ చెల్లించేందుకు అంగీకరించని టాటా కన్జ్యూమర్
  • ప్రస్తుతానికి నిలిచిన చర్చలు
Tata Groups talks over billion dollars Bisleri stake stall

బిస్లరీ వాటర్ వ్యాపారాన్ని టాటాలు కొనుగోలు చేస్తున్నట్టు ఆ మధ్య వార్తలు రావడం గుర్తుండే ఉంటుంది. బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,200 కోట్లు) పెట్టి, బిస్లరీ ఇంటర్నేషనల్ ను టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయనున్నట్టు సమాచారం వెలుగు చూసింది. కాకపోతే దీనిపై ఇరు సంస్థల మధ్య ఇంకా అంగీకారం కుదరలేదని తాజా సమాచారం. ముఖ్యంగా బిస్లరీ ప్రమోటర్లు డిమాండ్ చేస్తున్నంత చెల్లించేందుకు టాటాలు సుముఖత చూపడం లేదు. మరీ ఎక్కువ పెట్టి కొనుగోలు చేయడం లాభదాయకం కాబోదని టాటాలు పునరాలోచనలో పడినట్టు తెలిసింది.


విలువపై అంగీకారం కుదరకపోవడంతో దీన్ని పక్కన పెట్టినట్టు తాజా సమాచారం. బిస్లరీ ప్రమోటర్ బిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తున్నట్టు, దీంతో విలువపై అంగీకారం కుదరలేదని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. తిరిగి రెండు వర్గాల మధ్య చర్చలు మొదలు కావచ్చని, అదే సమయంలో ఇతర కంపెనీలు కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలో బాటిల్డ్ వాటర్ మార్కెట్లో బిస్లరీ ఇంటర్నేషనల్ కు 60 శాతం వాటా ఉంది. తన వారసురాలు ఈ వ్యాపారం పట్ల ఆసక్తి చూపకపోవడంతో, విక్రయించడానికి సిద్ధమైనట్టు లోగడ ప్రమోటర్ రమేష్ చౌహాన్ ప్రకటించడం తెలిసిందే.

More Telugu News