greece: ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు.. ఎగిసిపడ్డ మంటలు.. వీడియో ఇదిగో!

  • 32 మంది సజీవ దహనం
  • మరో 85 మందికి పైగా గాయాలు
  • గ్రీస్ లో ఘోర ప్రమాదం
32 passengers killed in Train accident in greece

గ్రీస్ లోని తెంపీ నగరంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో వేగం ఎక్కువగా ఉండడంతో మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ బోగీలలో మంటలు ఎగిసిపడ్డాయి. మిగతా బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలం బీభత్సంగా మారిందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో 32 మంది సజీవ దహనమయ్యారని వివరించారు. మరో 85 మందికి గాయాలయ్యాయని తెలిపారు.

ఏథెన్స్ నుంచి థెసాలోని వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్ తెంపీ దగ్గర్లో ఎదురుగా వస్తున్న కార్గో ట్రైన్ ను బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో రైలులో మొత్తం సుమారు 350 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రమాదం విషయం తెలియగానే ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైలు బోగీలలో చిక్కుకుపోయిన 200 మందిని బయటకు తీశారు.

గాయపడ్డ వారిని ఆసుపత్రులకు పంపించారు. గాయపడ్డ ప్యాసింజర్లలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News