preethi: నా బిడ్డకు ఎవరో ఇంజక్షన్ ఇచ్చారు.. ఆమెది హత్యే: ప్రీతి తండ్రి ఆరోపణలు

  • తన కూతురి మృతికి కారణాలు తెలపాలని ప్రీతి తండ్రి నరేందర్ డిమాండ్
  • నష్టపరిహారం ఇస్తే ప్రీతి తిరిగి వస్తుందా? అని ప్రశ్న
  • ఘటనలో సైఫ్ తోపాటు ఐదారుగురు ఉన్నారని ఆరోపణ 
preethi father comments on his daughter death

సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన మెడికో ప్రీతి ఆదివారం రాత్రి చనిపోయిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. తమ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుందని ఆశించిన తల్లిదండ్రులు.. ఆమె మ‌ృతితో విలపిస్తున్నారు. తమ కూతురు ఎంతో ఆశయంతో ఉండేదని, ఆమెతో పాటు ఆ ఆశయం కూడా చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 

తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్‌ ఆరోపించారు. ప్రీతికి ఎవరో ఇంజక్షన్‌ ఇచ్చారని, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రీతి మృతి చెందడానికి గల కారణాలు తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోస్టుమార్టమ్ రిపోర్టులు కూడా ఇవ్వలేదన్నారు.

కాకతీయ మెడికల్‌ కళాశాల అనస్థీషియా విభాగం హెచ్‌వోడీని సస్పెండ్‌ చేసిన తర్వాతే ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తేనే ప్రీతి మృతిపై పూర్తి వివరాలు, నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఘటనలో సైఫ్ తో ఇంకా ఐదారుగురు ఉన్నారని ఆరోపించారు. ప్రీతి లాంటి వాళ్లు బలికాకుండా చర్యలు తీసుకోవాలని నరేందర్‌ అన్నారు. నష్టపరిహారం ఇస్తే నా కూతురు తిరిగొస్తుందా? అని ప్రశ్నించారు.

More Telugu News