Warangal: ప్రీతి కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

  • ప్రీతి కుటుంబానికి రూ. 20 లక్షల సాయం ప్రకటించిన ఎర్రబెల్లి
  • పంచాయతీరాజ్ శాఖలో ఒకరికి ఉద్యోగం
  • స్వస్థలానికి ప్రీతి మృతదేహం తొలగింపు
Errabelli announce Rs 20 Lakh to Medico Preethi Family

ర్యాగింగ్‌కు బలైన వరంగల్ కాకతీయ వైద్య విద్యార్థిని కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అండగా నిలిచారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారానికి తోడు ఆయన కూడా రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు. గత రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రీతి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారని, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారని తొలుత ప్రకటించారు. తాజాగా, ప్రీతి తండ్రి నరేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షలతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూ. 20 లక్షల పరిహారం ప్రకటించినట్టు తెలిపారు.

అలాగే, పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే, ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారని పేర్కొన్నారు. హెచ్‌వోడీ, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. 

ప్రీతి మృతి తర్వాత అర్ధరాత్రి వరకు హైదరాబాద్ నిమ్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించకుండా కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత వారు అంగీకరించడంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఈ ఉదయం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో వారు తమ స్వస్థలమైన జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు.

More Telugu News