Russia: అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు... మానవ రహిత నౌకను పంపిన రష్యా

  • అంతరిక్షంలో రష్యా రెస్క్యూ ఆపరేషన్
  • గత డిసెంబరులో ఐఎస్ఎస్ కాప్సూల్ లో కూలెంట్ లీకేజి
  • అప్పటి నుంచి అంతరిక్షంలోనే ఉండిపోయిన వ్యోమగాములు
  • తాజాగా సోయుజ్ ఎంఎస్-23 ప్రయోగం
Russia sent space craft to rescue three astronauts

రష్యా తాజాగా అంతరిక్షంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఖగోళ రహస్యాల గుట్టు విప్పే పనిలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన ముగ్గురు వ్యోమగాములను భూమికి తీసుకురావడమే ఈ ఆపరేషన్ ఉద్దేశం. అందుకోసం రష్యా సోయుజ్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించింది. ఇది మానవ రహిత అంతరిక్ష నౌక. బైకనూన్ కాస్మోడ్రోమ్ నుంచి ఇది నింగికి ఎగిసింది. 

గత డిసెంబరులో ఐఎస్ఎస్ రిటర్నింగ్ కాప్సూల్ లో కూలెంట్ లీకేజిని గుర్తించారు. అప్పటి నుంచి రష్యాకు చెందిన వ్యోమగాములు సెర్గీ ప్రొకోప్యేవ్, దిమిత్రీ పెటెలిన్, నాసాకు చెందిన మరో వ్యోమగామి ఫ్రాంక్ రూబ్లో ఐఎస్ఎస్ లోనే నిలిచిపోయారు. వీరంతా గత సెప్టెంబరులో సోయుజ్ ఎంఎస్-22 నౌక ద్వారా ఐఎస్ఎస్ చేరుకున్నారు. 

తాజాగా రష్యా ప్రయోగించిన సోయుజ్ ఎంఎస్-23 స్పేస్ క్రాఫ్ట్ నిర్దేశిత కక్ష్యలో రెండు రోజులు పరిభ్రమించి ఐఎస్ఎస్ లోని రష్యా నియంత్రిత పోయిస్క్ మాడ్యూల్ తో అనుసంధానమవుతుంది. ముగ్గురు వ్యోమగాములను ఇది భూమికి తీసుకురానుంది.

More Telugu News