Delhi: అసలు ఏమిటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్..?

  • 2021 లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన ఢిల్లీ ప్రభుత్వం
  • మద్యం అమ్మకాలలో మరింత పారదర్శకత కోసమేనని వెల్లడి
  • పాలసీ అమలుతో ప్రభుత్వానికి అదనంగా రూ.8,900 కోట్లు వస్తాయని ప్రకటన
  • ప్రభుత్వ పాలసీలో అక్రమాలు జరిగాయని ఢిల్లీ పోలీస్ శాఖ ఆరోపణలు
  • సీబీఐ విచారణకు ఆదేశించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
  • మనీలాండరింగ్ ఆరోపణలతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు
  • తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల విచారణ, చార్జ్ షీట్ దాఖలు
What Is The Delhi Liquor Scam Your 10 Point Guide

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలోని పెద్దలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కలవరపెడుతోంది. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు, దాడులు చేస్తూ పలువురు నేతలకు నోటీసులు పంపి విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన అధికారులు విచారణకు రమ్మంటూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు మరోమారు నోటీసులు పంపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలతో పాటు ఇటీవల ఎన్నికలు జరిగిన గోవా పేరు కూడా ఈ స్కామ్ లో వినిపిస్తోంది. 

ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటనేది తెలుసుకుందాం..

లిక్కర్ అమ్మకాలకు సంబంధించి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, ఢిల్లీ ఎక్సైజ్ శాఖ 2021 లో కొత్త లిక్కర్ సేల్స్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది. పూర్తి పారదర్శకతతో దేశంలోనే బెస్ట్ పాలసీ అంటూ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఈ పాలసీపై ప్రశంసలు గుప్పించారు. వాస్తవానికి లిక్కర్ అమ్మకాలలో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో కల్పించుకోవు. కేంద్ర ప్రభుత్వం మాత్రం లిక్కర్ అక్రమ అమ్మకాల నియంత్రణ, వినియోగదారులకు కల్తీలేని మద్యం అందుబాటులో ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. మద్యం అమ్మకాలకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు షాపులను అప్పగిస్తుంది. దీనికి గాను వారి నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేస్తుంది. మద్యం అమ్మకాలపై పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది.

ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం.. మద్యం హోం డెలివరీ, మద్యం షాపులు ఉదయం 3 గంటల వరకు తెరుచుకునే వెసులు బాటు ఉంది. లైసెన్సుల జారీ విషయంలోనూ అపరిమిత డిస్కౌంట్లను ఢిల్లీ ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఈ వెసులుబాట్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని 27 శాతం పెంచుతున్నామని, అదనంగా రూ.8,900 కోట్లు ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయని ప్రకటించింది.

కొత్త పాలసీలో పలు ఆర్థిక అవకతవకలు జరిగాయని ఢిల్లీ పోలీసు శాఖ ప్రత్యేక విభాగం ఆరోపించింది. ఢిల్లీ పోలీసు శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. దీంతో ఈ అవకతవకల విషయాన్ని అటు కేంద్రానికి, ఇటు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రిపోర్టు చేసింది. లిక్కర్ అమ్మకాలకు సంబంధించిన లైసెన్సుల జారీ విషయంలో ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు మార్చేసిందనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన వారికి లైసెన్సులు కట్టబెట్టేందుకు, వారికి లాభం చేకూర్చేందుకే రూల్స్ మార్చేశారని ఆరోపిస్తూ సీబీఐ విచారణ జరిపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సీబీఐ విచారణ అంశం తెరపైకి రాగానే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ హెడ్ మనీశ్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, ఎల్జీ వీకే సక్సేనాపై సిసోడియా ఆరోపణలు గుప్పించారు. మద్యం విక్రేతలను వేధింపులకు గురిచేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇందుకోసం విచారణ సంస్థలను వాడుకుంటోందని విమర్శించారు. మద్యం పాలసీలో సవరణలపై చివరి నిమిషంలో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణలో మనీలాండరింగ్ వ్యవహారం వెలుగు చూడడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఇందులో కల్పించుకుంది. ఈ కేసుకు సంబంధించి గతేడాది సిసోడియాతోపాటు, ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసులు సహా 31 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేశారు. అయితే, ఈ సోదాల్లో అధికారులకు ఏమీ దొరకలేదని సిసోడియా ఆరోపించారు. దీనిని సీబీఐ ఖండించలేదు. అయితే, ఈ కేసుకు సంబంధించి తయారుచేసిన చార్జ్ షీట్ లో తెలంగాణ, ఏపీలకు చెందిన నేతల పేర్లను, సన్నిహితుల పేర్లను చేర్చిన అధికారులు సిసోడియా పేరును మాత్రం ఇప్పటి వరకూ చేర్చలేదు.

ఇక ఈడీ అధికారులు చేపట్టిన దర్యాఫ్తులో సౌత్ గ్రూప్ (ఏపీ, తెలంగాణ) కు చెందిన నేతలు లిక్కర్ లాబీగా ఏర్పడి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు మామూళ్లు చెల్లించారని తేల్చారు. గోవా ఎన్నికలలో ఆప్ ఈ సొమ్మును ఉపయోగించిందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ బిజినెస్ మెన్ ద్వారా ఈ సొమ్మును పంపించారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ వల్ల ప్రభుత్వానికి రూ.2,800 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు. ఈ కేసులో పలువురు నేతలను విచారించి, అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ అధికారులు విచారించారు. చార్జ్ షీట్ లోనూ కవిత పేరును చేర్చారు.

ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మాత్రం అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేదే లేదని కొట్టిపారేస్తున్నారు. తమ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో ఎలాంటి మోసం లేదని, దేశంలోనే అత్యుత్తమ పాలసీని తీసుకొస్తే కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. మద్యం అమ్మకాలలో మరింత పారదర్శకత, ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూర్చే ఉద్దేశంతోనే పాలసీకి రూపకల్పన చేశామని చెబుతున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విచారణ సంస్థలకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

More Telugu News