Amaravati: ఏపీ రాజధాని అమరావతే: పార్లమెంటులో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

  • అమరావతి రాజధానిగా 2015లో నోటిఫై చేశారన్న కేంద్రమంత్రి  
  • సీఆర్డీయేను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిందని వివరణ 
  • మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని వెల్లడి 
Central govt clarifies Amaravati is AP capital

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసిందని చెప్పింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేసిందని... ఆ కమిటీ సూచనలు, సలహాలు, నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా... దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. అనంతరం ఏపీసీఆర్డీయేను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. 


ప్రస్తుత ఏపీ ప్రభుత్వం 2020లో సీఆర్డీయేను రద్దు చేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొస్తున్నట్టుగా కొత్త బిల్లును తీసుకొచ్చిందని నిత్యానంద్ రాయ్ చెప్పారు. ఆ తర్వాత ఆ బిల్లును వెనక్కి తీసుకుందని, సీఆర్డీయే చట్టానికి కొనసాగింపుగా మరొక బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. రాజధాని అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని... దీనిపై ఇంతకు మించి మాట్లాడితే సబ్ జ్యుడిస్ అవుతుందని అన్నారు. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పారు.

More Telugu News