Chandrababu: 'అనురాగ దేవత' సినిమా షూటింగులో తొలిసారి ఎన్టీఆర్ ను కలిశాను: చంద్రబాబు

  • నేడు ఎన్టీఆర్ 27వ వర్ధంతి
  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో కార్యక్రమం
  • హాజరైన చంద్రబాబు, టీడీపీ సీనియర్ నేతలు
  • ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన చంద్రబాబు
Chandrababu paid tributes to NTR

ఇవాళ స్వర్గీయ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుంచుకునే వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఒక యుగపురుషునిగా, కారణజన్ముడిగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అని కీర్తించారు. 

"తెలుగు వారి ఆస్తి, తెలుగు వారి వారసత్వం ఎన్టీఆర్. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి... అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తి ఎన్టీఆర్. ఒక వ్యక్తి ఒక రంగంలోనే రాణిస్తారు....కానీ ఎన్టీఆర్ అటు సినిమా రంగంలో... ఇటు రాజకీయ రంగంలో కూడా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లారు. ఎన్టీఆర్ సినిమా రంగంలో పోషించిన పాత్రలు ఎవరూ పోషించలేరు. ఎంతో ఠీవీ, హుందాతనంతో ఎన్టీఆర్ నటన ఉండేది. ఎన్టీఆర్ సినిమాలు అంటే వినోదమే కాదు... సందేశం కూడా ఉండేలా నిర్మించారు. 

ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమయంలో నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను. 'అనురాగ దేవత' సినిమా షూటింగులో తొలిసారి ఎన్టీఆర్ ను కలిశాను. నా తొలి భేటీలోనే ఆయన ప్రజాసేవ గురించి వ్యాఖ్యానించారు. ఒక సినిమా నటుడిగా వచ్చి... తరువాత కాలంలో రాజకీయాలను సమూలంగా మార్చిన వ్యక్తి ఎన్టీఆర్. 

ఈ ఏడాది తెలుగుదేశం 40 ఏళ్లు పూర్తి చేసుకుంది... ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్ స్ఫూర్తి భావితరాలకు కూడా ఆదర్శం. మీ పార్టీ సిద్దాంతం ఏమిటంటే సమాజమే దేవాలయం... ప్రజలే నా దేవుళ్లు అని చెప్పిన నాయకుడు ఎన్టీఆర్. సమాజంలో ప్రజల రూపంలో దేవుడిని చూసిన వ్యక్తి ఎన్టీఆర్. 

ఆయన అతిపెద్ద సంస్కరణ వాది. ఆడబిడ్డల విద్యను ప్రోత్సహించాలని పద్మావతి యూనివర్సిటీ పెట్టారు. మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చింది కూడా ఆయనే. నేడు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటే దానికి నాంది పలికి.. అమలు చేసింది ఎన్టీఆర్. రాజకీయాల్లో పెత్తందారులు కాదు... చదువుకున్న వారిని తీసుకొచ్చి సీట్లు ఇచ్చిన నేత ఎన్టీఆర్. బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వడం కోసం అప్పటికి 29 ఏళ్ల వయసున్న యనమల రామకృష్ణుడు వంటి వారిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు" అంటూ చంద్రబాబు వివరించారు.

More Telugu News