Nirmala Sitharaman: త్వరలో కేంద్ర బడ్జెట్... కేంద్ర మంత్రి నిర్మల ఏమంటున్నారంటే...!

  • ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
  • మధ్యతరగతి వారిపై ఎప్పుడూ పన్నులు వేయలేదన్న ఆర్థికమంత్రి
  • మధ్యతరగతి కష్టాలు తనకు తెలుసని వెల్లడి
  • తాను కూడా మధ్యతరగతి నుంచే వచ్చానని వివరణ
Nirmala Sitharaman talks about budget

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు పలు బడ్జెట్లు ప్రవేశపెట్టానని, ఏ బడ్జెట్ లోనూ మధ్యతరగతి వారిపై పన్నులు వేయలేదని స్పష్టం చేశారు. మధ్యతరగతి ప్రజల కష్టాలు తనకు తెలుసని, తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని ఆమె వెల్లడించారు. 

మధ్యతరగతి వారిని మరింత సమస్యలకు గురిచేసేలా పన్నులు వేయలేదని, వారికి మరిన్ని సేవలు అందిస్తామని వివరించారు. ఇకపైనా తమ ప్రభుత్వం మధ్యతరగతి వర్గం అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని అన్నారు. అంతేకాదు, మధ్యతరగతి ప్రజలు భారీ ఎత్తున నగరాలకు వలస వెళుతున్న నేపథ్యంలో దేశంలో స్మార్ట్ సిటీల అభివృద్ధిపై దృష్టి పెట్టామని తెలిపారు. 

రూ.5 లక్షల వరకు పూర్తిగా పన్ను మినహాయింపునిస్తున్నామని వెల్లడించారు. దేశంలోని 27 నగరాల్లో మెట్రోరైలు వ్యవస్థలు తీసుకొచ్చామని, మెట్రోరైలు వ్యవస్థలు మధ్యతరగతి వారికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. తాము నేరుగా మధ్యతరగతి ప్రజల జేబుల్లోకి డబ్బులు వేయడంలేదని, వారికి అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

More Telugu News