GITAM University: గీతం వైద్య కళాశాల మైదానాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు

  • తెల్లవారుజామునే చేరుకున్న రెవెన్యూ అధికారులు
  • స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ కంచె
  • ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్ల ఏర్పాటు
  • మీడియాను కూడా అనుమతించని పోలీసులు
  • కక్ష సాధింపు చర్యగా పేర్కొన్న ‘గీతం’ యాజమాన్యం
High tension at Gitam University in Visakhapatnam

విశాఖపట్టణంలోని గీతం మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కళాశాల మైదానాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది దాని చుట్టూ కంచె వేశారు. మరోవైపు, ముందు జాగ్రత్త చర్యగా అక్కడ పోలీసులను భారీగా మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసులు పహారా కాస్తున్నారు. మీడియాను కూడా కళాశాలలోకి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాజా పరిణామాలపై స్పందించిన గీతం యూనివర్సిటీ యాజమాన్యం.. దీనిని ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా ఆరోపించింది.

మరోవైపు, భీమిలి ఆర్డీవో భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. కళాశాలను ఆనుకుని ఉన్న 14 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్ చేశామని, నేడు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని 5.25 ఎకరాల్లో కంచె వేసినట్టు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న భూమిలో పది చోట్ల ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టినట్టు చెప్పారు. కంచె పనులు త్వరగా పూర్తవ్వాలన్న ఉద్దేశంతో తెల్లవారుజాము నుంచే పనలు ప్రారంభించినట్టు చెప్పారు.

More Telugu News