Team India: అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ వృథా... భారత్ ఓటమి

  • పూణేలో టీమిండియా వర్సెస్ శ్రీలంక
  • శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు
  • టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 రన్స్
  • 31 బంతుల్లో 65 పరుగులు చేసిన అక్షర్
Team India lost to Sri Lanka in 2nd T20

పూణేలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. శ్రీలంక విసిరిన 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసింది. విజయానికి దగ్గరగా వచ్చి 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

ఓ దశలో భారత్ 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా... అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఆటతీరుతో జట్టును లక్ష్యానికి చేరువగా తీసుకువచ్చారు. అయితే జట్టు స్కోరు 148 పరుగుల వద్ద సూర్యకుమార్ వెనుదిరిగాడు. సూర్య 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 51 పరుగులు చేశాడు. 

ఆ తర్వాత శివమ్ మావి అండతో అక్షర్ పటేల్ తన దూకుడు కొనసాగించాడు. అయితే చివరి ఓవర్లో భారత్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా, అక్షర్ ఓ ఫుల్ టాస్ ను కొట్టబోయి లాంగాన్ లో క్యాచ్ ఇచ్చాడు. దాంతో భారత్ ఆశలు అడుగంటాయి. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 65 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 3 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. శివమ్ మావి 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 26 పరుగులు చేశాడు. 

శ్రీలంక బౌలర్లలో మధుశంక 2, కసున్ రజిత 2, కెప్టెన్ దసున్ షనక 2. కరుణరత్నే 1, హసరంగ 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో శ్రీలంక మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 7న రాజ్ కోట్ లో జరగనుంది.

More Telugu News