Beijing: చైనాలో కరోనా విలయం... బెడ్లు ఖాళీ లేక స్ట్రెచర్లపైనే రోగులకు ఆక్సిజన్

  • చైనాలో లాక్ డౌన్ ఎత్తివేత
  • ఇన్నాళ్లు జీరో కొవిడ్ పాలసీ అనుసరించిన డ్రాగన్ దేశం
  • లాక్ డౌన్ ఎత్తివేత అనంతరం ఒక్కసారిగా విరుచుకుపడిన కరోనా
  • బీజింగ్ లో ఆసుపత్రులన్నీ ఫుల్
  • వరుసగా వస్తున్న మృతదేహాలతో శ్మశానాల్లోనూ రద్దీ
Situation worsen in Beijing as hospitals provides oxygen for corona patients on stretchers due to lac of beds

చైనాలో కరోనా మహమ్మారి కోరలు చాచి విజృంభిస్తోంది. రాజధాని బీజింగ్ లో వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెల్లడవుతున్నాయి. ఇన్నాళ్లూ జీరో కొవిడ్ పాలసీకి కట్టుబడి కఠిన లాక్ డౌన్ విధించిన చైనా, ఇటీవల లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో, దేశంలో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా ప్రబలింది. 

ప్రస్తుతం బీజింగ్ లో ఈ రాకాసి వైరస్ విలయతాండవం చేస్తోంది. వేలల్లో కొత్త కేసులు వస్తుండడంతో ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ ఉండడంలేదు. దాంతో కరోనా పాజిటివ్ రోగుల్లో ఆక్సిజన్ అవసరమైన వారికి స్ట్రెచర్లపైనే చికిత్స అందిస్తున్నారు. 

బీజింగ్ లోని చుయాంగ్లియు ఆసుపత్రిలో ఎక్కడపడితే అక్కడ స్ట్రెచర్లపై ఆక్సిజన్ అమర్చిన కరోనా రోగులు దర్శనమిస్తున్నారు. కొందరిని వీల్ చెయిర్లలో కూర్చోబెట్టి చికిత్స చేస్తున్నారు. చాలా ఆసుపత్రులు వెల్లువలా వస్తున్న కరోనా రోగులకు బెడ్లు ఏర్పాటు చేయలేక చేతులెత్తేశాయి.

అటు, శ్మశానాలు సైతం వరుసగా వస్తున్న మృతదేహాలతో రద్దీగా మారాయి. కాగా, చైనా తీరు పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర అసంతృప్తితో ఉంది. తాజాగా కరోనా ఉద్ధృతిపై చైనా వెల్లడిస్తున్న గణాంకాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా లేవని స్పష్టం చేసింది.

More Telugu News