Hyderabad: హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో 70 ఏళ్ల వృద్ధురాలి ఆత్మహత్య

  • ఎర్రగడ్డ స్టేషన్ పై నుంచి దూకిన వృద్ధురాలు
  • వృద్ధురాలిది మహబూబాబాద్ జిల్లా మక్తల్ గా గుర్తింపు
  • కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు
70 years old woman dies after jumping from Erragadda Metro Station in Hyderabad

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ వద్ద దారుణం చోటుచేసుకుంది. స్టేషన్ పై నుంచి దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రయాణికులతో పాటు మెట్రో స్టేషన్ లోకి ప్రవేశించిన వృద్ధురాలు అకస్మాత్తుగా కిందికి దూకేసింది. పై నుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం ఎక్కువగా జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తోటి ప్రయాణికులు ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధురాలిని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మ (70) గా గుర్తించారు.

పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. మారెమ్మ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఆమె హైదరాబాద్ కు ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటనే వివరాలను ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మారెమ్మ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సనత్‌ నగర్‌ పోలీసులు వివరించారు.

More Telugu News