Enforcement Directorate: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ లకు ఈడీ నోటీసులు

  • బెంగళూరు డ్రగ్స్ కేసులో నోటీసుల జారీ
  • ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని ఆదేశం
  • తనకు నోటీసులు వచ్చినట్టు వెల్లడించిన రోహిత్ రెడ్డి
EDissues notices to MLA Rohit Reddy and heroine Rakul Preet

ఎమ్మెల్యేలకు ఎర కేసులో వార్తల్లో నిలిచిన తాండూరు శాసన సభ్యుడు, బీఆర్ఎస్ కు చెందిన పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విషయంలో ఈనెల 19న విచారణకు హాజరు కావాలని  నోటీసులో పేర్కొంది. 

బెంగళూరులోని ఓ పార్టీలో నమోదైన డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. 

 తనకు ఈడీ నోటీసులు వచ్చిన విషయాన్ని రోహిత్ కూడా ధ్రువీకరించారు. అయితే, వాటిని ఇంకా చూడలేదని చెప్పారు. ఏ కేసులో తనకు నోటీసులు వచ్చాయో తెలియదన్నారు. తన వ్యాపారాలు, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అడిగారని తెలిపారు. 

 కాగా, గత ఏడాది ఫిబ్రవరి 26న బెంగళూరు తూర్పు డివిజన్‌ పోలీసులు సినీ ప్రముఖులకు మత్తు మందులు సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద లభించిన సమాచారంతో డ్రగ్స్ ఖాతాదారుల్లో తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారులు, శాసనసభ్యుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరిని బెంగళూరు పోలీసులు గతంలోనే విచారించారు.

More Telugu News