Delhi man: మిస్డ్ కాల్ తో రూ.అరకోటి ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు !

  • ఢిల్లీ వాసికి వింత అనుభవం
  • ఫోన్ నంబర్ కు మిస్డ్, బ్లాంక్ కాల్స్ 
  • ఆ తర్వాత ఆర్టీజీఎస్ నగదు బదిలీ ఎస్ఎంఎస్ లు
  • సిమ్ స్వాపింగ్ విధానంలో మోసం
Delhi man receives missed calls and then loses Rs 50 lakh heres about the new cybercrime

మన వ్యక్తిగత వివరాలు అంటే ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, కార్డు నంబర్ ఇలాంటి సున్నితమైన డేటాను ఎవరితోనూ షేర్ చేయకూడదని నిపుణులు తరచూ చెబుతూనే ఉన్నారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై అవగాహనకు సంబంధించిన సమాచారం విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. అయినా కానీ, ఇప్పటికీ సైబర్ నేరస్థులు విసిరిన వలకు చిక్కుకుని సర్వస్వం పోగొట్టుకుంటున్నారు. ఇవి షేర్ చేయకపోయినా, మన స్విమ్ ను స్వాప్ చేసి దోచుకెళ్లే నేరస్థులు కూడా ఉన్నారు.

కేవలం బ్లాంక్ కాల్స్, మిస్డ్ కాల్స్ రూపంలో ఢిల్లీకి చెందిన వ్యక్తి నుంచి రూ.50 లక్షలు ఊడ్చేశారు. సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేసే విద్యావంతుడైన వ్యక్తికే ఈ అనుభవం ఎదురు కావడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం సంబంధిత వ్యక్తి ఫోన్ కు రాత్రి 7-8.45 మధ్య వరుసగా మిస్డ్ కాల్స్, బ్లాంక్ కాల్స్ వచ్చాయి. అంటే కాల్ చేసిన వారు మాట్లాడకపోవడాన్ని బ్లాంక్ కాల్ అంటారు. కానీ, ఆ తర్వాత తన ఫోన్ కు వచ్చిన ఎస్ఎంఎస్ లు చూసి ఢిల్లీ వాసి కంగు తిన్నాడు. ఆర్టీజీఎస్ రూపంలో నేరస్థులు రూ.50 లక్షలను బదిలీ చేసుకున్నట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. 

ఝార్ఖండ్ కు చెందిన అద్దె ఖాతాలకు (నేరస్థులు అమాయకుల ఖాతాలను అద్దెకు తీసుకుని వినియోగించుకుంటారు) ఈ నిధులు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. స్విమ్ స్వాప్ ఫ్రాడ్ ద్వారా ఈ మోసం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. స్విమ్ స్వాప్ అంటే.. సైబర్ నేరగాళ్లు తమ వద్దనున్న సిమ్ కార్డ్ ను, బాధితుడి ఫోన్ నంబర్ కు అనుసంధానిస్తారు. ట్రిక్ ద్వారా ఈ పని చేస్తారు. ఆ తర్వాత బాధితుడి ఫోన్ కు కాల్స్, ఎస్ఎంఎస్ లు రావు. అవి నేరస్థుల వద్దనున్న ఫోన్ కు వెళతాయి. 

కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి కూడా రూ.60 లక్షలు మోసపోయాడు. కౌన్ బనేగా కరోడ్ పతిలో రూ.1.50 కోట్లు గెలుచుకున్నట్టు సందేశం వచ్చింది. సంప్రదించాలనే నంబర్ కు బాధితుడు కాల్ చేయడంతో, అవతలి వారు ముగ్గులోకి దింపి రూ.60 లక్షలు రాబట్టారు.

More Telugu News