K Kavitha: మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు.. ఈసారి 91 సీఆర్పీసీ కింద నోటీసులు!

  • నిన్న ఏడున్నర గంటల సేపు కవితను ప్రశ్నించిన సీబీఐ అధికారులు
  • తాము చెప్పిన చోటుకు రావాలంటూ సీబీఐ మరోసారి నోటీసులు
  • విచారణ తేదీ, స్థలాన్ని మెయిల్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్న సీబీఐ
CBI issues another notice to Kavitha under 91 CRPC

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న సీబీఐ అధికారులు సుదీర్ఘ సమయం పాటు విచారించారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో దాదాపు ఏడున్నర గంటల సేపు ప్రశ్నించారు. అనంతరం, మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ సారి సీఆర్పీసీ 160 కింద కాకుండా... సీఆర్పీసీ 91 కింద సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 160 కింద అయితే విచారణ జరిపే వ్యక్తి ఇష్టానుసారం వారి నివాసంలో కూడా కేవలం ఒక సాక్షిగా మాత్రమే ప్రశ్నిస్తారు. సీఆర్పీసీ 91 కింద విచారణ అంటే... సీబీఐ చెప్పిన చోటుకు విచారణ నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది. విచారణ మరింత లోతుగా జరుగుతుంది.

తాము చెప్పిన చోటుకు వచ్చి విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఇచ్చిన సీఆర్పీసీ 91 నోటీసుల్లో కవితను సీబీఐ అధికారులు కోరారు. తాము అడిగిన పత్రాలను విచారణకు తీసుకురావాలని చెప్పారు. కేసుకు సంబంధించి మరింత సమాచారం కావాలని... తాము అడిగిన పత్రాలను, సాక్ష్యాలను ఇవ్వాలని ఆదేశించారు. విచారణ తేదీ, స్థలాన్ని త్వరలోనే మెయిల్ చేస్తామని చెప్పారు. 

మరోవైపు, నిన్న ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లారు. వీరిలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు కవిత ఇంటి నుంచి సీబీఐ అధికారులు వెళ్లిపోయారు.

More Telugu News