ఎంసీడీ ఎన్నికల్లో ‘ఆప్’ గెలిచినా.. మేయర్ పీఠం డౌటే!
- ఎంసీడీ ఎన్నికల్లో 250 స్థానాలకు గాను 134 స్థానాల్లో ‘ఆప్’ విజయం
- ఎంసీడీలో వార్డు సభ్యులకు వర్తించని ఫిరాయింపు చట్టం
- బీజేపీ కూడా మేయర్ అభ్యర్థిని నిలబెట్టే చాన్స్
ఎంసీడీ వార్డు మెంబర్లకు పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదు. కాబట్టి ఎవరు ఎవరికైనా ఓటేసుకోవచ్చు. అతిపెద్ద పార్టీగా నిలిచిన ‘ఆప్’ కనుక మేయర్ అభ్యర్థిని నిలబెడితే బీజేపీ వ్యతిరేకించి తమ అభ్యర్థిని కూడా నిలబెట్టొచ్చు. అప్పుడు వార్డు సభ్యులు ఎవరికి నచ్చిన వారికి వారు ఓటేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మేయర్ పీఠం ఎవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నిబంధనల విషయాన్ని బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జ్ అమిత్ మాలవీయ ట్విట్టర్ ద్వారా తెలిపారు. చండీగఢ్లోనూ ఇలాగే జరిగింది. అక్కడిప్పుడు బీజేపీ నేత మేయర్గా ఉన్నారు.
ఢిల్లీలో గతంలో 272 వార్డులుండేవి. అయితే, ఈస్ట్, సౌత్, నార్త్ మునిసిపల్ కార్పొరేషన్లను కలిపేసి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)గా మార్చడంతో వార్డుల సంఖ్య 250కి తగ్గింది. ఆ తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. అలాగే, అప్పట్లో ముగ్గురు మేయర్లు ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఒకే మేయర్. ఇక, ఎంసీడీలో ప్రతి ఏడాది ఏప్రిల్లో కొత్త మేయర్ను ఎన్నుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికయ్యే మేయర్ నాలుగు నెలలు మాత్రమే పదవిలో ఉంటారు.