Nishit Pramanik: చోరీ కేసులో కేంద్ర మంత్రికి అరెస్ట్ వారెంట్!

  • 2009 నాటి చోరీ కేసు నిందితుల్లో నిషిత్ ప్రామాణిక్ ఒకరు
  • విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు
  • 2019లో బీజేపీలో చేరిన నిషిత్
Arrest Warrant to Union minister Nishit Pramanik

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిషిత్ ప్రామాణిక్ కు పశ్చిమ బెంగాల్ లోని అలీపూర్ దువార్ జిల్లా కోర్టు షాకిచ్చింది. ఒక చోరీ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన 2009 నాటిది. అలీపూర్ దువార్ జిల్లాలో నగల చోరీ ఘటనకు సంబంధించినది. ఈ కేసులో నిషిత్ ప్రామాణిక్ ఒకరు. ఈ కేసు విచారణ చివరి రోజున కోర్టుకు ఇతర నిందితులు హాజరుకాగా... నిషిత్ ప్రామాణిక్ తరపు న్యాయవాది హాజరుకాలేదు. దీంతో నిషిత్ పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే అరెస్ట్ వారెంట్ కు సంబంధించి అలీపూర్ దువార్ జిల్లా ఎస్పీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇక రాజకీయాల విషయానికి వస్తే... నిషిత్ 2019లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ సమక్షంలో బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై గెలిచారు. కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. కేంద్ర మంత్రుల్లో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రుల్లో ఒకరిగా ఉన్నారు. బీజేపీలో చేరక ముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జిల్లా స్థాయి వ్యవహారాలను ఆయన చూసుకునేవారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆయనపై మమతా బెనర్జీ వేటు వేశారు.

More Telugu News