Twitter: సారీ చెప్పిన ట్విట్టర్ అధినేత మస్క్.. కారణం ఇదే!

  • పలు దేశాల్లో ట్విట్టర్ సర్వీసులకు అంతరాయం
  • క్షమాపణ కోరిన ఎలాన్ మాస్క్
  • 8 డాలర్ల పెయిడ్ వెరిఫైడ్ సర్వీస్ ఉపసంహరణ
Elon Musk Apologises For Twitter

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ యూజర్లకు క్షమాపణ  చెప్పారు. పలు దేశాల్లో ట్విట్టర్ సర్వర్లు డౌన్ కావడంతో ఆయన క్షమాపణ కోరారు. మరోవైపు నెలకు 8 డాలర్లతో ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్ల విషయంలో మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెయిడ్ వెరిఫైడ్ సర్వీసు వల్ల ఫేక్ అకౌంట్లు ఎక్కువగా నమోదవుతుండటంతో ట్విట్టర్ యాజమాన్యం ఈ నిబంధనలు సవరించాలని నిర్ణయించింది. 8 డాలర్ల సబ్ స్ర్కిప్షన్ రూల్ ను వెనక్కి తీసుకుంది. వారం రోజుల్లో కొత్త నిబంధనలు వెల్లడిస్తామని ప్రకటించింది.

44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత సంస్థలో అనేక మార్పులు జరుగుతున్నాయి. తాను పగ్గాలు అందుకున్న వెంటనే ట్విట్టర్ లో కీలక వ్యక్తులను మస్క్ తొలగించారు. అలాగే, పాలసీ విధానాల్లోనూ తన మార్కు చూపిస్తున్నారు. ఈ క్రమంలో పెయిడ్ వెరిఫైడ్ సర్వీసు అందరికీ అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా, ఇతర ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే బ్లూటిక్ మార్కు అందించింది. 

కానీ, మస్క్ నాయకత్వంలో నెలకు 8 డాలర్లు చెల్లించిన ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, కొత్త రూల్ వచ్చాక డబ్బులు చెల్లించి బ్లూ టిక్ ను ఎవరు పడితే వాళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఫేక్ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. ఏసుక్రీస్తు, సైతాన్ పేర్లతో కూడా బ్లూ టిక్ ఉన్న అకౌంట్లు కనిపించడంతో ట్విట్టర్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో 8 డాలర్లు చెల్లించిన ఎవ్వరికైనా బ్లూటిక్ అందించే సర్వీసును వెనక్కి తీసుకుంది.

More Telugu News