Supreme Court: జైలు నుంచి రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదల

  • 1991లో శ్రీపెరంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్య
  • అరెస్టయిన వారిలో ఏడుగురికి జీవిత ఖైదు విధించిన కోర్టు
  • ఇదివరకే విడుదలైన పెరారివలన్
  • తాజాగా నళిని సహా ఆరుగురికి విముక్తి ప్రసాదించిన సుప్రీంకోర్టు
  • వేలూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఆరుగురు
rajiv gandhi murderers released from jail

దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన ఆరుగురు వ్యక్తులకు శనివారం స్కేచ్ఛ లభించింది. ఈ కేసులో 32 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని, శ్రీహరన్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్ లు తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదలయ్యారు. 

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఎల్టీటీఈకి చెందిన ఓ మహిళా సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడం ద్వారా రాజీవ్ ను హత్య చేశారు. ఈ కేసులో అరెస్టయిన నళిని, శ్రీహరన్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, పెరారివాలన్ లు దోషులుగా తేలడంతో వారికి కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో వీరిని తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. 

32 ఏళ్లుగా వీరు అదే జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. వీరిలో పెరారివాలన్ కు గత మే నెలలో సుప్రీంకోర్టు స్వేచ్ఛను ప్రసాదించింది. తాజాగా సుప్రీంకోర్టు మిగిలిన దోషులకు కూడా స్వేచ్ఛను ప్రసాదించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలు విడుదలైన మరునాడు వీరు వేలూరు జైలు నుంచి విడుదలయ్యారు.

More Telugu News