VV Vinayak: అప్పట్లో థియేటర్ల దగ్గర జాతర కనిపించేది: వినాయక్   

  • మాస్ డైరెక్టర్ గా మార్కులు కొట్టేసిన వినాయక్ 
  • తాజా ఇంటర్వ్యూలో ఓటీటీ సినిమాల గురించిన ప్రస్తావన 
  • ఓటీటీ వలన నిర్మాతలకి ఏమీ ఒరగలేదని వ్యాఖ్య 
  • థియేటర్లకు జనాలు రాకపోవడం పట్ల అసంతృప్తి 
V V Vinayak Interview

టాలీవుడ్ లో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా వినాయక్ కి మంచి పేరుంది. ఆయన పేరు చెప్పగానే 'ఆది' .. 'దిల్' .. 'ఠాగూర్' .. 'అదుర్స్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం ఆయన 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బిజీగా ఉన్నారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ గురించి మాట్లాడుతూ .. "ఓటీటీ కారణంగా నిర్మాతలు సేఫ్ గా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పెట్టే నియమ నిబంధనల కారణంగా పరిస్థితులు ఆశాజనకంగా లేకుండా పోయాయి. 
 
కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా, కొన్ని రోజుల్లో ఓటీటీలో వస్తుంది గదా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. పెద్ద సినిమాలే అయినా ఫస్టు రోజున థియేటర్ లకి వెళితే 20 మంది .. 30 మంది కనిపిస్తున్నారు. హిట్ అయిన సినిమా థియేటర్లో కూడా రెండు మూడు రోజుల తరువాత జనాలు కనిపించడం లేదు. ఒకప్పుడు థియేటర్లు ఎంతలా కళకళలాడుతూ ఉండేవో కదా అనిపిస్తోంది. ఒకప్పుడు పెద్దసినిమా రిలీజ్ ఉంటే, అక్కడేదో జాతర జరుగుతుంది అన్నట్టుగా అనిపించేది. ఇప్పుడసలు అలాంటి వాతావరణమే కనిపించడం లేదు" అన్నారు. 

 'ఖైదీ నెంబర్ 150' సినిమా తొలి ఆటను ముందుగా 'చాగల్లు'లోని మా సొంత థియేటర్లో వేయాలని ప్లాన్ చేశాము. అక్కడ మిడ్ నైట్ షో వేస్తున్నామని తెలుసుకుని హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆ ఊరు వెళ్లారంటే నమ్మండి. ఇక రాజమండ్రితో పాటు మిగతా ఏరియాల నుంచి కూడా జనాలు రావడంతో, మా థియేటర్ సరిపోక ఎదురుగా ఉన్న థియేటర్ వారికి చెప్పి అక్కడ కూడా ఆ రాత్రి షో పడేలా చేయవలసి వచ్చింది. థియేటర్లో సినిమా చూడాలనే ఒక ఇంట్రెస్ట్ ఆ స్థాయిలో ఉండేది .. కానీ ఇప్పుడేది?" అంటూ నిట్టూర్చారు.

More Telugu News