Munugode: మునుగోడులో గెలుపు బీజేపీదేనంటున్న మిషన్ ఛాణక్య సర్వే

Mission Chanakya predicts komatireddy rajgopal reddy will win munugode bypoll
షార్ట్స్‌లో చూడండి
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే రెండు సంస్థల ఎగ్జిట్ పోల్స్ విడుదల కాగా... తాజాగా కౌంటింగ్ కు ఓ రోజు ముందు శనివారం సాయంత్రం మిషన్ చాణక్య తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. తొలి రెండు సర్వే సంస్థలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని చెప్పగా... మిషన్ చాణక్య సంస్థ మాత్రం మునుగోడు విజేత బీజేపీనేనని తేల్చేసింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తారని ఆ సంస్థ వెల్లడించింది.

మిషన్ చాణక్య సర్వే ప్రకారం... మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి 40.16 శాతం ఓట్లు రానుండగా... టీఆర్ఎస్ కు 38.38 ఓట్లు రానున్నట్లు తేలింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి మాత్రం కేవలం 14.93 శాతం ఓట్లు రానున్నట్లు తేల్చింది. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన అందోజు శంకరాచారికి 4.29 శాతం ఓట్లు రానున్నట్లు మిషన్ చాణక్య తేల్చింది. ఇతరులకు 1.9 శాతం ఓట్లు వస్తాయని చెప్పిన మిషన్ చాణక్య... ఎన్నికల్లో బీజేపీ 1.78 శాతం ఓట్లతో విజయం సాధించనున్నట్లు తేల్చింది. ఈ లెక్కన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 3,900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించనున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. అయితే మెజారిటీలో 1,400 ఓట్ల మేర హెచ్చుతగ్గులు ఉండవచ్చని మిషన్ చాణక్య తెలిపింది.

ఇదిలా ఉంటే... తెలంగాణలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా మిషన్ చాణక్య వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలే నిజమయ్యాయి. దుబ్బాక, హుజూరాబాద్ లో రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ లు గెలవనున్నారని మిషన్ చాణక్య వెల్లడించింది. ఈ నేపథ్యంలో మునుగోడులోనూ మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజం కావడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో వారు మిషన్ చాణక్య ఫలితాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Go Back to Shorts
Munugode
Telangana
BJP
Komatireddy Raj Gopal Reddy
Mission Chanakya
Exit Polls

More Telugu News