Prashant Kishor: బీహార్ ఉప ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

  • ఉప ఎన్నికలు మహా కూటమిలో చిచ్చు రేపుతాయన్న పీకే
  • ఆరేళ్లలో నితీశ్ వివిధ కూటములతో 10 ప్రయోగాలు చేశారని వ్యాఖ్య
  • రాబోయే రోజుల్లో కూటమిలో విభేదాలు తప్పవన్న పీకే
Prashant Kishor comments on Bihar by polls

బీహార్ లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ జేడీయూ పార్టీ, ఆర్జేడీలు చేతులు కలిపిన తర్వాత జరిగిన ఎన్నికలు కావడం వల్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా పీకే మాట్లాడుతూ... ఈ ఎన్నికలు బీహార్ లోని మహా ఘట్ బంధన్ కూటమిలో చిచ్చు రేపుతాయని అన్నారు. గత ఆరేళ్లుగా సీఎం నితీశ్ కుమార్ వివిధ కూటములతో 10 ప్రయోగాలు చేశారని చెప్పారు. 

జేడీయూ, ఆర్జేడీలు చేతులు కలిపి బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నామని భావిస్తున్నాయని... కానీ, రాబోయే రోజుల్లో ఈ కూటమిలో అంతర్గత విభేదాలు తప్పవని అన్నారు. ఉప ఎన్నికల తర్వాత ఈ విభేదాలు బయటకు వస్తాయని చెప్పారు. బీహార్ లో గోపాల్ గంజ్, మోకమా నియోజకవర్గాల్లో ఈరోజు ఉప ఎన్నికలు జరిగాయి. గోపాల్ గంజ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణించారు. మోకామాలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ పై అనర్హత వేటు పడింది. దీంతో, ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి కూడా ఈరోజు ఉప ఎన్నిక జరుగుతోంది.

More Telugu News