Apple: భారత్ లో ఐఫోన్ అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం పొందిన ఆపిల్

  • నాలుగో త్రైమాసికం ఫలితాలు వెల్లడించిన ఆపిల్
  • ప్రపంచవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో అమ్మకాల జోరు
  • రెండంకెల్లో వృద్ధి రేటు
  • భారత్ లో ఆల్ టైమ్ హై అమ్మకాలు
Apple set record with all time high revenue by iPhone sales in India

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఏడాదికి గాను నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. తన ప్రధాన ఉత్పత్తి ఐఫోన్ అమ్మకాల ద్వారా భారత్ లో రికార్డు స్థాయిలో ఆదాయం పొందినట్టు తెలిపింది. 

దీనిపై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ స్పందిస్తూ, ఈ త్రైమాసికంలో ప్రపంచంలోని ప్రతి మార్కెట్లోనూ తమకు అద్భుతమైన ఆదాయం లభించిందని వివరించారు. దాదాపు ప్రతి భౌగోళిక విపణిలోనూ రికార్డు అనదగ్గ స్థాయిలో ఆదాయం పొందామని తెలిపారు. భారత్ లో రెండంకెల వృద్ధిరేటు అందుకున్నామని టిమ్ కుక్ చెప్పారు. 

ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ, లాటిన్ అమెరికా దేశాల్లోనూ ఇదే తరహాలో వృద్ధి నమోదు చేశామని వివరించారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మరింత విజయవంతంగా అమ్మకాలు సాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

ఆపిల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ లూకా మాయెస్ట్రీ స్పందిస్తూ, సెప్టెంబరులో తమ ఆర్థిక ఫలితాలు రికార్డు నెలకొల్పాయని తెలిపారు. ముఖ్యంగా, భారత్ లో ఆల్ టైమ్ రికార్డు స్థాపించామని పేర్కొన్నారు. 

కాగా, ఐఫోన్ 14 మోడల్ తీసుకువచ్చిన ఆపిల్... దీన్ని భారత్ లో తయారుచేసేందుకు నిర్ణయించింది. ఐఫోన్ 14 మోడల్ అమ్మకాల దన్నుతోనే ఆపిల్ కు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

More Telugu News