Atchannaidu: అమరావతి రైతులపై రాజమండ్రిలో ఎంపీ ఆధ్వర్యంలోనే దాడి జరిగింది: అచ్చెన్నాయుడు

  • అమరావతి రైతులపై రాజమండ్రిలో చెప్పులు, బాటిళ్లతో దాడి
  • దీన్ని భావప్రకటన స్వేచ్ఛ అంటారా అని డీజీపీని ప్రశ్నించిన అచ్చెన్న
  • ఎంపీ భరత్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్
Atchannaidu reacts after YCP workers attacked Amaravathi farmers

అమరావతి రైతుల మహా పాదయాత్ర రాజమండ్రిలో కొనసాగుతుండగా వైసీపీ శ్రేణులు చెప్పులు, సీసాలు విసరడం తెలిసిందే. దాంతో రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. 

నేడు రాజమండ్రిలో అమరావతి రైతులపై జరిగిన దాడిని కూడా భావప్రకటన స్వేచ్ఛ అంటారా డీజీపీ గారూ? అని ప్రశ్నించారు. ఒక ఎంపీ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. 

అమరావతి రైతులకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పుడు కూడా, సాక్షాత్తు ఎంపీ ఆధ్వర్యంలోనే దాడి జరిగితే సామాన్యులకు ఏ విధమైన రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. తక్షణమే ఎంపీ భరత్, అతడి గూండాలపై హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. 

మొన్న విశాఖ ఎయిర్ పోర్టు వద్ద నిరసన తెలిపిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టారు... నేడు దాడి జరిగినా కేసులుండవా? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేసే మీరు వీళ్లను అక్కడికి ఎలా రానిచ్చారు? అంటూ నిలదీశారు.

More Telugu News