Mexico: మెక్సికోలో దారుణం.. దుండగుల కాల్పుల్లో చట్టసభ్యురాలు, మేయర్ సహా 21 మంది మృతి

  • మేయర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా దుండగుల కాల్పులు
  • మేయర్, ఆయన తండ్రి సహా 21 మంది మృతి
  • మరో ఘటనలో చట్టసభ్యురాలిని కాల్చి చంపిన దుండగులు
Mayor and 20 Others Killed By Gunmen In Mexico Town

మెక్సికోలో దుండగులు జరిపిన కాల్పుల్లో మేయర్, చట్టసభ్యురాలు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. శాన్ మిగేల్ టోటోలాపన్‌ పట్టణంలో మేయర్ కొన్రాడో మెనండోజా అల్మెడా అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మేయర్, మాజీ మేయర్ అయిన ఆయన తండ్రి సహా 20 మంది మృతి చెందారు. ఘటన అనంతరం నిందితుల కోసం ఆర్మీ, నేవీ రంగంలోకి దిగింది. 

2015-17 మధ్య గెరెరోను నాశనం చేసిన లాస్ టెక్విలెరోస్ క్రిమినల్ గ్యాంగుపై ఈ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ నాయకుడు రెబెలో జాకోబో డి అల్మోంటో హతమయ్యే వరకు ఈ ప్రాంతంలో మేయర్‌లను ఈ గ్యాంగు బెదిరిస్తూ ఉండేది. మేయర్ అల్మెడాకు చెందిన పార్టీ పార్టిడో డి లా రెవెల్యూసియన్ డెమొక్రిటికా (పీఆర్‌డీ) ఈ ఘటనను ఖండించింది. కాగా, మోరెలోస్ రాష్ట్రంలోని క్యుర్నవాకాలో జరిగిన మరో ఘటనలో చట్టసభ్యురాలు గాబ్రియెలా మరీన్‌ ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఆమెను అతి సమీపం నుంచి కాల్చి చంపారు.

More Telugu News