KCR: మ‌ధ్యాహ్నం 1.19 గంట‌ల‌కు బీఆర్ఎస్ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న చేసిన కేసీఆర్‌

  • జాతీయ పార్టీపై ఏక‌వ‌చ‌న తీర్మానం ప్ర‌వేశ పెట్టిన ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి
  • ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపిన టీఆర్ఎస్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం
  • జాతీయ పార్టీ ఆవిర్భావంపై సీఎం ప్ర‌క‌ట‌న‌.. సంబ‌రాల్లో మునిగిన పార్టీ శ్రేణులు
  • పేరు మార్పుపై ఎన్నిక‌ల క‌మిష‌న్ కు లేఖ‌ 
KCR announces BRS party

తెలంగాణ రాష్ట్ర స‌మితి.. భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ ఎస్‌)గా మారింది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఏక‌వ‌చన తీర్మానాన్ని ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌వేశపెట్టారు. దీనికి స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి హాజ‌రైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం, మ‌ధ్యాహ్నం 1.19 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ ఇక‌పై బీఆర్ఎస్ గా మార‌నుంది. ఈ మేర‌కు తెలంగాణ భ‌వ‌న్ నుంచి మీడియాకు ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. అలాగే, టీఆర్ఎస్ ను భార‌త్ రాష్ట్ర స‌మితిగా గుర్తించాలంటూ భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ కు టీఆర్ఎస్ ప్రధాన కార్య‌ద‌ర్శి పేరిట రాసిన‌ లేఖను కూడా మీడియాకు విడుద‌ల చేశారు.

జాతీయ పార్టీ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే తెలంగాణ భ‌వ‌న్ లో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబ‌రాలు మొద‌లు పెట్టారు. కాగా, సాయంత్రం జ‌రిగే మీడియా స‌మావేశంలో సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ విష‌యంలో మ‌రిన్ని వివ‌రాలను వెల్ల‌డించబోతున్నారు. ఈ స‌మావేశంలో క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, జేడీఎస్ నేత కుమార‌స్వామి, వీసీకే అధినేత తిరుమాళవన్‌తో పాటు క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుకు చెందిన ప‌లువురు నాయ‌కులు పాల్గొనే అవ‌కాశం ఉంది. వీళ్లంతా ఇప్ప‌టికే సీఎంతో క‌లిసి తెలంగాణ భ‌వ‌న్ లో ఉన్నారు.

More Telugu News