rains: తెలంగాణ‌లో మ‌రో మూడు రోజులపాటు వ‌ర్షాలు

  • హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ కేంద్రం
  • హైద‌రాబాద్‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ
  • పిడుగుపాటుతో రాష్ట్రంలో నిన్న న‌లుగురి మృతి 
Rain threat for telangana fro three days

తెలంగాణ‌లో మ‌రోసారి వ‌ర్షాలు ప్ర‌జ‌లను ఇబ్బంది పెట్ట‌నున్నాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చ‌రించింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. రాజ‌ధాని న‌గ‌రంలో రెండు రోజుల నుంచి వ‌ర్షాలు కురు‌స్తున్నాయి. మంగ‌ళ‌వారం ఒక్క‌సారిగా వ‌చ్చిన వ‌ర్షంతో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ్డారు. గురువారం రాత్రి కూడా ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ముఖ్యంగా హయత్ నగర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సరూర్ నగర్, కాప్రా ప్రాంతాల్లో భారీ వ‌ర్షంతో ఆ ప్రాంతాల‌న్నీ జ‌ల‌మయం అయ్యాయి. 

రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో కూడా గురువారం వ‌ర్షం కురిసింది. వివిధ ప్రాంతాల్లో పిడుగులు ప‌డి నలుగురు చ‌నిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో పిడుగు పాటుకు ఇద్ద‌రు మృతి చెందారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కన్నాయపల్లిలో పిడుగుపడి అలాట చంద్రమౌళి అనే వ్యక్తి చనిపోయాడు. అతని రెండు ఎడ్లు కూడా చనిపోయాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం శివారులో పిడుగుపాటుకు కొమ్ము సత్తన్న అనే ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు.

More Telugu News