Lalu Prasad Yadav: వైద్య చికిత్స కోసం సింగపూర్ వెళ్లేందుకు లాలు ప్రసాద్ యాదవ్ కు కోర్టు అనుమతి

  • లాలుపై ఐఆర్ సీటీసీ స్కాం కేసు
  • అభియోగాలు దాఖలు చేసిన సీబీఐ
  • పాస్ పోర్టు స్వాధీనం
  • 2019లో లాలూకు బెయిల్
  • ఇటీవల పాస్ పోర్టు విడుదలకు కోర్టు ఆదేశాలు
Court gives permission to Lalu Prasad Yadav to go to Singapore for treatment

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం తెలిసిందే. దానికితోడు కొన్ని నెలల కిందట తన నివాసంలో జారిపడడంతో కుడి భుజం ఎముక విరిగింది. వీపు భాగంలోనూ గాయమైంది. కొన్నాళ్లపాటు ఐసీయూలో ఉండి చికిత్స పొందారు. 

ఈ నేపథ్యంలో, మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం సింగపూర్ వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. సీబీఐ నమోదు చేసిన ఐఆర్ సీటీసీ స్కాంలో లాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనకు 2019లో బెయిల్ లభించింది. రెండు రైల్వే హోటళ్ల నిర్వహణ బాధ్యతలను ఓ కంపెనీకి అప్పగించేందుకు లంచం తీసుకున్నట్టు లాలుపై అభియోగాలు నమోదయ్యాయి.

కాగా, స్వాధీనం చేసుకున్న తన పాస్ పోర్టును తిరిగి ఇప్పించేలా లాలు దాఖలు చేసుకున్న పిటిషన్ పై రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఈ నెల 16న విచారణ జరిపింది. లాలూకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 

తాజాగా, ఢిల్లీ కోర్టు ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 10 నుంచి 25వ తేదీ మధ్య సింగపూర్ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది.

More Telugu News