Raghu Rama Krishna Raju: తిరుమలలో జగన్ ప్రసాదం తీసుకోలేదు: రఘురామకృష్ణరాజు

  • ఏపీ ప్రభుత్వం అప్పుల వేట కొనసాగుతోందన్న రఘురాజు 
  • నిన్నటితో రూ. 49 వేల కోట్ల అప్పు చేశారని విమర్శ 
  • ఈ డబ్బులు ఎక్కడకు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్య 
Jagan not taken Prasadam says Raghu Rama Krishna Raju

ఏపీ ప్రభుత్వంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలను ఎక్కుపెట్టారు. తప్పు చేసి అప్పు కూడు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని ఆయన విమర్శించారు. నిన్నటితో రూ. 49 వేల కోట్ల అప్పు చేశారని... ఇప్పటికే ఈ ఏడాది రుణం దాటేసిందని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం కూడా వెల్లడించిందని... అయినప్పటికీ ఏపీ ప్రభుత్వ రుణ వేట కొనసాగుతూనే ఉందని అన్నారు. వేటగాడు అడవికి వెళ్లినట్టు... రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన ఢిల్లీకి వెళ్లి అప్పు వేటలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 

గత 6 నెలల కాలంలో రూ. 49 వేల కోట్ల అప్పు చేసిన సంగతి నిజమా? కాదా? అనే సంగతి చెప్పాలని ముఖ్యమంత్రి జగన్ ను, బుగ్గనను అడుగుతున్నానని రఘురాజు చెప్పారు. ఈ డబ్బులన్నీ ఎక్కడకు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. తిరుమల దర్శనానికి వచ్చిన జగన్ ప్రసాదం తీసుకోలేదని విమర్శించారు. ఆయన క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.

More Telugu News