Telangana: వ్య‌వ‌సాయ కూలీల చేతి ముద్ద తిని.. వారికీ ముద్ద తినిపించిన వైఎస్ ష‌ర్మిల‌

  • తెలంగాణ‌లో ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర చేస్తున్న ష‌ర్మిల‌
  • పాల‌మూరు జిల్లా క‌ల్వ‌కుర్తిలో కొన‌సాగుతున్న యాత్ర
  • వ్యవ‌సాయ కూలీల‌తో క‌లిసి భోజ‌నం చేసిన వైఎస్సార్టీపీ అధినేత్రి
ys sjharmila takes mealwith agricultural labour

ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర పేరిట తెలంగాణ‌ను చుట్టేస్తున్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌... ప్ర‌స్తుతం పాల‌మూరు జిల్లా క‌ల్వ‌కుర్తిలో త‌న యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం క‌ల్వ‌కుర్తిలోనే ఓ వైపున జోరున వర్షం కురుస్తున్నా...వ‌ర్షంలో త‌డుస్తూనే ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన ష‌ర్మిల ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. తాజాగా మంగ‌ళ‌వారం కల్వ‌కుర్తి ప‌రిధిలోనే ఆమె వ్య‌వ‌సాయ మ‌హిళా కూలీల‌తో క‌లిసి భోజ‌నం చేసిన ఫొటోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి.

క‌ల్వ‌కుర్తి ప‌రిధిలో వ్య‌వ‌సాయ ప‌నుల‌కు వ‌చ్చిన మ‌హిళా కూలీల‌తో బాసింప‌ట్లు వేసుకుని కూర్చుని షర్మిల భోజ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ మ‌హిళా కూలీ త‌న చేతితో షర్మిల నోట్లో అన్నం ముద్ద పెట్టారు. ఆ త‌ర్వాత ష‌ర్మిల కూడా ఆ కూలీ నోటికి త‌న చేతితో ముద్ద‌ను అందించారు. ఈ ఫొటోల‌ను ష‌ర్మిల సోష‌ల్ మీడియా ఖాతాల్లో మంగ‌ళ‌వారం పోస్ట్ అయ్యాయి. 

ఈ సంద‌ర్భంగా వైఎస్సార్ కూతురిగా త‌న ప‌ట్ల కురుస్తున్న ప్రేమానురాగాల‌ను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ బిడ్డపై మీరు చూపిస్తున్న ప్రేమానురాగాలు వెలకట్టలేనివ‌న్న ష‌ర్మిల‌... వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి తొలి ప్రాధాన్యం ప్రజలేన‌ని తెలిపారు. ప్ర‌జ‌ల ముఖాల్లో చిరునవ్వు చూడడమే త‌మ‌ లక్ష్యమ‌ని ఆమె చెప్పారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో త‌న‌ను బిడ్డగా ఆదరించి, గోరుముద్దలు తినిపించిన అవ్వలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాన‌ని ష‌ర్మిల పేర్కొన్నారు.

More Telugu News