Pakistan: హాంకాంగ్‌పై అతిపెద్ద విజయం సాధించిన పాకిస్థాన్.. రేపు భారత్‌తో ఢీ!

  • పాక్ బౌలర్ల దెబ్బకు చిగురుటాకులా వణికిన హాంకాంగ్
  • 10.4 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌట్
  • 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన పాక్
  •  సూపర్-4లోకి ప్రవేశించిన పాకిస్థాన్
Pakistan enter Super Fours with massive win

ఆసియా కప్‌లో భాగంగా గత రాత్రి హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్ చిగురుటాకులా వణికింది. పాకిస్థాన్ నిర్దేశించిన 194 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హాంకాంగ్ 10.4 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌట్ అయింది. షాదాబ్ ఖాన్ 2.4 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి హాంకాంగ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను ఛిన్నాభిన్నం చేశాడు. మహ్మద్ రిజ్వాన్ 3, నసీమ్ షా 2 వికెట్లు పడగొట్టారు. హాంకాంగ్ బ్యాటర్లలో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కాగా, కెప్టెన్ నిజాకత్ ఖాన్ చేసిన 8 పరుగులే అత్యధికం కావడం గమనార్హం.

నిజానికి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. చివరి వరకు పోరాడింది. ఒక దశలో విజయం దోబూచులాడింది. దీంతో పాకిస్థాన్‌-హాంకాంగ్ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. అయితే, హాంకాంగ్‌ను ఏ దశలోనూ కుదురుకోనివ్వని పాకిస్థాన్ ఘన విజయం సాధించి సూపర్-4కు దూసుకెళ్లింది. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ 57 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 78 పరుగులు చేశాడు. ఫకర్ జమాన్ 53, ఖుష్‌దిల్ 35 (నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజం 9 పరుగులు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన రిజ్వాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టీ20ల్లో పాకిస్థాన్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. కాగా, ఈ విజయంతో సూపర్-4లోకి ప్రవేశించిన పాకిస్థాన్ రేపు మరోమారు భారత్‌ను ఢీకొంటుంది.

More Telugu News