Narendra Modi: తన వేలు పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చానన్న ప్రధాని మోదీ కామెంట్లపై శరద్ పవార్ స్పందన ఇదే..

NCP chief Sharad Pawar responds to PM Modi comments
  • దీని వల్ల తాను ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో తెలియదన్న ఎన్సీపీ అధినేత
  • ఈ వయసులో బాధ్యతలకు దూరంగా ఉంటానని వెల్లడి
  • 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టీకరణ
తనను చూసి రాజకీయాల్లో ముందుకొచ్చానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై  ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ‘మీ వేలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని ప్రధాని మోదీ చెప్పారు. దీనిపై మీరు ఏమంటారు’ అని ఓ విలేకరి పవార్ ను ప్రశ్నించగా.. ‘దీనివల్ల నేను ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందో తెలియదు’ అని ఆయన చమత్కరించారు. అదే సమయంలో ఈ వయసులో తాను ఇక ఎలాంటి బాధ్యతలు చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు  81 ఏళ్ల సీనియర్ నాయకుడు తెలిపారు. 

2024 సార్వత్రిక ఎన్నికల్లో  ప్రతిపక్షాల  ప్రధాని అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని రూపొందించేందుకు బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి మాత్రమే తాను సహాయం చేస్తానని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి చిన్న పార్టీలను అధికారం నుంచి తప్పించేందుకు కేంద్ర ఏజెన్సీలను బీజేపీ ఉపయోగించుకుంటోందని పవార్ విమర్శించారు. 

‘బీజేపీ తన ప్రత్యర్థులపై చేస్తున్నది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి తప్ప మరొకటి కాదు.  ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలన్నింటిలో శాసన సభ్యులను విభజించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. మహారాష్ట్రనే అందుకు ఉదాహరణ’ అని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు.
Narendra Modi
ncp
Sharad Pawar
pm
comments
BJP

More Telugu News