CM KCR: డెంగీ, మలేరియా ముసురుతున్నా నిర్లక్ష్యమేనా?.. సీఎం కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

  • దోమలు పెరిగి జ్వరాలు ప్రబలుతున్నాయన్న విజయశాంతి 
  • ప్రభుత్వ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని మండిపాటు
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల్లేక జనం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారని వ్యాఖ్య
Vijayashanti fire on CM KCR

భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో వ్యాధులు ముసురుకుంటున్నాయని.. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ పేరుకు మాత్రం చెప్పేది బంగారు తెలంగాణ‌ అని.. కానీ ఆయన పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు చేశారు. తెలంగాణ‌లో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని.. భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు. 

డెంగీ విజృంభిస్తోంది..
‘‘దోమల వల్ల డెంగీ, మలేరియా.. కలుషిత ఆహారం, నీటివల్ల టైఫాయిడ్‌‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇళ్ల చుట్టూ నీరు నిలవడం, డ్రైనేజీలు నిండిపోవడం, ఓపెన్ ప్లాట్లన్నీ మురికి కుంటల్లా మారడంతో దోమలు వృద్ధి చెంది డెంగీ విజృంభిస్తోంది. వర్షాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సిన సర్కారు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. వర్షాలు పడి, వరదలు వచ్చిపోయిన తర్వాత సర్కారు తీసుకుంటున్న చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి..” అని విజయశాంతి మండిపడ్డారు.

సరిగా వైద్యం అందక ఇబ్బందులు
‘‘గ్రామాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కానీ భారీగా డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆసుపత్రుల్లో వైద్యం సరిగా అందడం లేదు. ప్రజలకు మరో దిక్కులేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు అందినకాడికి దోచుకుంటున్నాయి. టెస్టుల పేరుతో వేలకువేలు గుంజుతున్నాయి. డెంగీ బాధితులను ప్లేట్ లెట్లు తగ్గాయని భయపెడుతూ దోపిడీ చేస్తున్నాయి. ఇంత జ‌రుగుతున్నా కేసీఆర్ స‌ర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది” అని విజయశాంతి మండిపడ్డారు.

ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని ప్రజలకు సరైన వైద్యం అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఆడుకుంటున్న కేసీఆర్ స‌ర్కారుకు తెలంగాణ ప్ర‌జానీక‌ం కచ్చితంగా బుద్ధి చెబుతుందని వ్యాఖ్యానించారు.

More Telugu News