Axar Patel: అక్షర్ పటేల్ వీరోచిత ఇన్నింగ్స్.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్

  • ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం
  • 312 పరుగుల విజయ లక్ష్యాన్నిఛేదించిన టీమిండియా
  • వందో మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చుకున్న హోప్
  • ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్
Axar Patels maiden ODI fifty seals series win for India

వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్‌పార్క్ ఓవల్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ అర్ధ శతకాలకు తోడు చివర్లో అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్‌తో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ షాయ్ హోప్ (115) శతకబాదుడుతో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

312 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తడబడింది. 48 పరుగుల వద్ద కెప్టెన్ శిఖర్ ధావన్ (13) అవుటయ్యాడు. ఆ తర్వాత కూడా స్వల్ప వ్యవధిలోనే శుభమన్ గిల్ (43), సూర్యకుమార్ యాదవ్ (9) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ క్రీజులో కుదురుకోవడంతో జట్టు నిలదొక్కుకున్నట్టు కనిపించింది. 

అయితే, అయ్యర్ 63, శాంసన్ 54 పరుగులు చేసి అవుటయ్యాక టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. 205 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోవడం, ఆదుకుంటాడనుకున్న దీపక్ హుడా 33 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడం, శార్దూల్ ఠాకూర్ (3), అవేశ్ ఖాన్ (10) కూడా క్రీజులోకి వచ్చినట్టు వచ్చి వెనుదిరగడంతో భారత్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ క్రీజులో పాతుకుపోయిన అక్షర్ పటేల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు.

చివరి ఓవర్‌లో భారత జట్టు విజయానికి 8 పరుగులు అవసరం కాగా, తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి అక్షర్ పటేల్ ఒక్క పరుగు తీశాడు. మూడో బంతికి సిరాజ్ మరో పరుగు తీసి అక్షర్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఇప్పుడు మూడు బంతుల్లో ఆరు పరుగులు అవసరం. మేయర్స్ వేసిన నాలుగో బంతిని అక్షర్ పటేల్ బలంగా బాదాడు. అంతే.. బంతి అలా ఎగురుకుంటూ వెళ్లి స్టాండ్స్‌లో పడింది. భారత శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.

దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతమైంది. మొత్తంగా 8 వికెట్లు కోల్పోయిన భారత్ చివరి ఓవర్‌లో విజయాన్ని అందుకుని ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. 35 బంతుల్లో 3 ఫోర్లు, ఐదు సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేసిన అక్షర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అక్షర్‌కు వన్డేల్లో ఇదే తొలి అర్ధ సెంచరీ. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు సాధించింది. వందో టెస్టు ఆడిన విండీస్ ఓపెనర్ షాయ్ హోప్ ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. 135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు సాధించాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ 74 పరుగులు చేశాడు. మేయర్స్ 39, షమర్ బ్రూక్స్ 35, రోవ్‌మన్ పావెల్ 13, రొమారియో షెపర్డ్ 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు మూడు వికెట్లు లభించాయి. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఎల్లుండి ఇదే మైదానంలో జరుగుతుంది.

More Telugu News