8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన మోదీ హైదరాబాద్ వస్తున్నారు: నారాయణ

CPI Narayana alleges modi killer of democracy
  • సన్యాసినని చెప్పుకుంటున్న మోదీ మేకప్ కోసం నెలకు రూ. 70 లక్షలు ఖర్చు చేస్తున్నారన్న నారాయణ
  • ఫెడరల్ స్ఫూర్తికి తాము విరుద్ధమని తీర్మానం చేయాలని సూచించిన సీపీఐ నేత
  • అమిత్ షా దేశంలోనే నంబర్ వన్ క్రిమినల్ అంటూ ఫైర్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శలతో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. బలం లేకున్నా ప్రభుత్వాలను పడగొట్టి 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారని విమర్శించారు. మరి ఆయన తీరును బీజేపీ సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న బీజేపీ ఫెడరల్ స్ఫూర్తికి తాము విరుద్ధమని ఈ సమావేశాల్లో తీర్మానం చేయాలని నారాయణ సూచించారు.

గత ప్రభుత్వాలు రూ. 40 లక్షల కోట్లు అప్పు చేస్తే మోదీ ఆ మొత్తాన్ని రూ. 85 లక్షల కోట్లకు తీసుకెళ్లారని మండిపడ్డారు. సన్యాసినని చెప్పుకునే మోదీ తన మేకప్ కోసం నెలకు రూ. 70 లక్షలు ఖర్చు చేస్తున్నారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని అన్నారు. మోదీ హయాంలో 25 మంది రూ. 25 లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారన్నారు. అమిత్ షాపైనా నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా దేశంలోనే నంబర్ వన్ క్రిమినల్ అని నారాయణ విరుచుకుపడ్డారు.
Go Back to Shorts
CPI Narayana
Narendra Modi
BJP
Hyderabad

More Telugu News