Nitin Gadkari: నో పార్కింగ్ ప్లేస్‌లో వాహనం కనిపించిందా?.. ఫొటో తీసి పంపితే నజరానాగా జరిమానాలో సగం!

  • అక్రమ పార్కింగ్‌పై ఉక్కుపాదం మోపనున్న కేంద్రం
  •  రోడ్లపై రద్దీకి అడ్డగోలు పార్కింగులే కారణమంటున్న మంత్రిత్వశాఖ
  • కొత్త చట్టం తీసుకొస్తామన్న మంత్రి గడ్కరీ
Soon Get Rs 500 For Clicking Photo of Vehicle Parked In No Parking Zone says Gadkari

రోడ్డుపై వెళ్తుండగా నో పార్కింగ్ స్థలంలో వాహనం కనిపిస్తే వెంటనే ఫొటో తీసి పంపిస్తే నజరానా మీ సొంతమవుతుంది. రోడ్లపై ఇష్టానుసారంగా పెరిగిపోయి తీవ్ర రద్దీకి కారణమవుతున్న అక్రమ పార్కింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఓ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాంగ్ పార్కింగ్ వాహనాలను ఫొటోలు తీసి అధికారులకు పంపిస్తే.. ఆ వాహనానికి విధించే జరిమానాలో సగాన్ని ఫొటో పంపిన వ్యక్తికి ఇవ్వనున్నట్టు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఫొటోలను పంపించే వ్యక్తులకు బహుమానం ఇవ్వడాన్ని చట్టంలోనూ పొందుపరుస్తామన్నారు. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఇళ్ల వద్ద వాహన పార్కింగ్‌కు స్థలాన్ని కేటాయించకుండా రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో తన కుక్‌కు రెండు సెకండ్ హ్యాండ్ వాహనాలు ఉన్నాయని, నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న వారికి ఆరు వాహనాలు ఉంటున్నాయన్నారు. ఎవరూ పార్కింగ్ స్థలాన్ని విడిచిపెట్టడం లేదని, ఢిల్లీ వాసులు అదృష్టవంతులని, వారు రోడ్డు పక్కనే వాహనాలు నిలుపుతున్నారంటూ మంత్రి నవ్వుతూ చెప్పుకొచ్చారు.

More Telugu News