Chennai Super Kings: అదరగొట్టిన శామ్స్.. ప్లే ఆఫ్స్ నుంచి చెన్నై అవుట్

  • లో స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా డేనియల్ శామ్స్
  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన చెన్నై
Daniel Sams crush Chennai playoffs hopes

చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో గత రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ముంబై వెళ్తూవెళ్తూ చెన్నైని కూడా ఇంటికి తీసుకెళ్లింది. ఆ జట్టుకు ఏ మూలో మిణుకుమిణుకుమంటున్న ప్లే ఆఫ్స్ అవకాశాలను చిదిమేసింది. 

తొలుత ముంబై బౌలర్ల దెబ్బకు 97 పరుగులకే కుప్పకూలిన చెన్నై.. ఆ తర్వాత బౌలింగులోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా ముంబై 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

98 పరుగుల లక్ష్య ఛేదనలో 33 పరుగులకే నాలుగు కీలక వికెట్లు చేజార్చుకున్నప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుకున్న ముంబై అలవోకగా విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (6), డేనియల్ శామ్స్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (0) విఫలం కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ (18) పేలవ ఫామ్ మరోమారు కొనసాగింది. హృతిక్ షాకన్ 18, టిమ్ డేవిడ్ 16 (నాటౌట్) పరుగులు చేశారు. తిలక్ వర్మ 34 (నాటౌట్) పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరికి మూడు వికెట్లు దక్కాయి.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్ల దెబ్బకు చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా, అందులో ముగ్గురు డకౌట్ అయ్యారు. రాబిన్ ఊతప్ప 10, శివం దూబే 10, బ్రావో 12 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 4 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ముంబై బౌలర్ డేనియల్ శామ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మెరిడిత్, కుమార్ కార్తికేయ చెరో వికెట్ తీసుకున్నారు. 

ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించినా పాయింట్ల పట్టికలో అట్టడుగునే ఉంది. ఓడిన చెన్నై స్థానం కూడా మారలేదు. ముంబై జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుట్ కాగా, ఇప్పుడు చెన్నైని కూడా తనతోపాటు ఇంటికి తీసుకెళ్లింది. ఐపీఎల్‌లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

More Telugu News