Nara Lokesh: నారా లోకేశ్‌పై రాళ్ల‌దాడిపై మంత్రి బొత్స స్పంద‌న ఇదే

botsa satyanarayana comments on stone pelting on nara lokesh
  • లోకేశ్‌పై దాడిపైనా స్పందించాలా? అన్న బొత్స 
  • దాడి చేసింది ఎవ‌రో ఎవ‌రికి తెలుసని ప్రశ్న 
  • మాజీ సీఎంగా చంద్ర‌బాబు హుందాగా ఉంటారని కితాబు 
  • చిల్ల‌ర‌గా ఉంటే... చిల్ల‌ర‌గానే ఉంటుంద‌న్న బొత్స‌
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండ‌లం తుమ్మ‌పూడిలో హ‌త్యకు గురైన బాధితురాలి కుటుంబాన్ని ప‌రామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌పై రాళ్ల దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వైసీపీ, టీడీపీ శ్రేణుల మ‌ధ్య జ‌రిగిన వాదులాట‌, తోపులాట‌ల నేప‌థ్యంలోనే ఈ దాడి జ‌ర‌గ‌గా... వైసీపీ శ్రేణులే త‌న‌పై రాళ్ల దాడి చేసేందుకు య‌త్నించాయ‌ని లోకేశ్ ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌లో లోకేశ్‌కు ఏమీ కాకున్నా ఇద్ద‌రు పోలీసుల‌కు మాత్రం గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తాజాగా స్పందించారు. 

ఈ సంద‌ర్భంగా బొత్స మాట్లాడుతూ... "చంద్ర‌బాబుపై దాడి జ‌రిగితే స్పందిస్తాం. లోకేశ్‌పై దాడి జ‌రిగితే కూడా స్పందించాలా? లోకేశ్‌పై దాడి చేసింది వైసీపీ కార్య‌క‌ర్త‌లో, క‌డుపు మండిన వాళ్లో ఎవ‌రికి తెలుసు? అధికారంలో ఉన్న‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉంటే.. ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చాక ఇలాంటి దాడులు జ‌ర‌గ‌వు. మాజీ సీఎం కాబ‌ట్టి చంద్ర‌బాబు హుందాగా ఉంటారు. చిల్ల‌ర‌గా ఉంటే... చిల్ల‌ర‌గానే ఉంటుంది" అంటూ బొత్స కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
Nara Lokesh
TDP
YSRCP
Botsa Satyanarayana

More Telugu News