మత్తు వద్దంటూ ప్లకార్డు పట్టిన మంత్రి తలసాని
- డ్రగ్స్ దుష్ప్రభావాలపై నగర పోలీసుల ర్యాలీ
- స్వయంగా ప్లకార్డు పట్టుకుని పాలుపంచుకున్న తలసాని
- మత్తు మనిషిలోని నైపుణ్యాలను చంపేస్తుందని హెచ్చరిక
డ్రగ్స్ వాడకాన్ని సమూలంగా అరికట్టాలని హైదరాబాద్ నగర పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా డ్రగ్స్తో దొరికితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియజేస్తున్నారు.
ఇందులో భాగంగా, మత్తులో మునిగితే చిత్తు కాక తప్పదు అన్న స్లోగన్తో నేడు నగరంలోని బేగంపేటలో ఓ అవగాహన ర్యాలీని నిర్వహించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, డీసీపీ చందనా దీప్తి తదితరులు పాలుపంచుకున్న ఈ ర్యాలీలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా పాల్గొన్నారు. మత్తు పదార్థాలు మనిషిలోని నైపుణ్యాలను దెబ్బ తీస్తాయన్న ప్లకార్డు పట్టుకుని మంత్రి ర్యాలీకి ముందు నడిచారు.