Jagan: ఏపీ మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం ప‌ట్ల జ‌గ‌న్ స‌హా ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి

jagan condolence gowtam reddy
  • మేక‌పాటి హ‌ఠాన్మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాను: జ‌గ‌న్
  • చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డారు:  బొత్స‌
  • మేక‌పాటి కుటుంబానికి ప్రగాఢ‌ సానుభూతి: విజ‌య‌సాయిరెడ్డి
  • తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాను:  లోకేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల పలువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న కార్యక్ర‌మాల‌న్నింటినీ వాయిదా వేసుకున్నారు. ఐటీ మంత్రిగా ఉన్న మేక‌పాటి గౌతమ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని జ‌గ‌న్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు.

మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డార‌ని అన్నారు. తాను సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందని చెప్పారు. ఆయన కుటుంబస‌భ్యుల‌కు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

'పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖామాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్‌రెడ్డి గారి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. యువ నాయకుడిగా, మంత్రిగా గౌతమ్‌రెడ్డి గారు రాష్ట్రానికి విశేషమైన సేవలందించారు. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబసభ్యులకు ప్రగాఢ‌ సానుభూతి తెలియజేస్తున్నాను' అని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

'మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాను. ఫిట్నెస్‌కి అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చే మంత్రి గారికి గుండెపోటు రావ‌డం అత్యంత విచార‌క‌రం. విదేశాల‌లో ఉన్న‌త‌ విద్యాభ్యాసం చేసి వ‌చ్చినా విన‌యం, విధేయ‌త‌లు ఆయ‌న చిరునామా. ఐదుప‌దుల వ‌య‌స్సులోనే హుందా గ‌ల రాజ‌కీయ‌వేత్త‌గా పేరుగాంచిన మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మ‌న‌కి దూరం కావ‌డం తీర‌ని విషాదం. మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను' అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

'ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణం బాధాకరం. వారి మృతికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను' అని టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు.

'ఆసుప‌త్రికి ఫోన్ చేశాను. ఆయ‌న మృతి చెందార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. నిన్న రాత్రి కూడా ఆయ‌న చాలా చురుకుగా ఉన్నారు. ఈ రోజు గౌతం లేరన్న వార్త బాధ క‌లిగిస్తోంది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను' అని సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు.

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్‌రెడ్డి గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

మేక‌పాటి గౌతమ్‌రెడ్డి చాలా యాక్టివ్‌గా ఉండేవారని, ఏపీ మంత్రి వ‌ర్గంలో మంచి పేరు తెచ్చుకున్నార‌ని సీపీఐ నేత నారాయ‌ణ అన్నారు. మేక‌పాటి గౌతంరెడ్డి హఠాన్మరణం ప‌ట్ల ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు సానుభూతి తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News