south africa: వెలుగులోకి మ‌రో వైర‌స్‌.. అది సోకితే ప్రతి ముగ్గురిలో ఒక‌రి మృతి!

  • దక్షిణాఫ్రికాలో 'నియో కోవ్‌' అనే కొత్త రకం వైరస్‌
  • అతి వేగంగా వ్యాప్తి చెంద‌గ‌ల‌ద‌న్న చైనా శాస్త్ర‌వేత్త‌లు
  • గబ్బిలాల్లో ఈ నియో కోవ్‌ వైరస్
  • జంతువుల నుంచి మనుషులకు సోకే ముప్పు
new virus in sa

ఇప్ప‌టికే డెల్టా, ఒమిక్రాన్ వంటి ఆందోళ‌న‌కర క‌రోనా వేరియంట్లు ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతుతోన్న విష‌యం తెలిసిందే. భ‌విష్య‌త్తుల్లో మ‌రిన్ని ప్ర‌మాద‌క‌ర‌ క‌రోనా వేరియంట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మొద‌టి నుంచీ శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. వారు హెచ్చ‌రించిన‌ట్లుగానే మ‌రికొన్ని క‌రోనా వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. 

ఒక‌వైపు తాజా క‌రోనా వైర‌స్ ఒమిక్రాన్ ఆందోళ‌న రేపుతుంటే, మ‌రోవైపు ఇప్పుడు మరో కొత్త వైరస్‌ను చైనాలోని వూహాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణాఫ్రికాలో 'నియో కోవ్‌' అనే కొత్త రకం వైరస్‌ వెలుగులోకి వ‌చ్చింద‌ని చెప్పారు. ఇది అతి వేగంగా వ్యాప్తి చెంద‌గ‌ల‌ద‌ని, మరణాల రేటు కూడా అధికంగానే ఉంటుంద‌ని తెలిపారు. అది సోకితే ప్రతి ముగ్గురిలో ఒక‌రు మృతి చెందుతార‌ని చెప్పారు.

గబ్బిలాల్లో ఈ నియో కోవ్‌ వైరస్ బయటపడిందని, ఇది కూడా కరోనా వైరసే అని చెప్పారు. ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే ప్ర‌స్తుతం వ్యాపిస్తోంద‌ని తెలిపారు. అయితే, ఆ వైర‌స్‌లోని ఓ మ్యుటేషన్‌ కారణంగా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే ముప్పు ఉంద‌ని శాస్త్రవేత్తలు తెలిపారు. గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్ ను నియో కోవ్‌ వైరస్ ప్రభావవంతగా వాడుకుంటోంద‌ని వివ‌రించారు.

గ‌బ్బిలాల‌తో పోల్చితే మ‌నుషుల్లో ఆ ఎంజైమ్‌ను ఏమార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం ఆ వైర‌స్‌కు కాస్త తక్కువగా ఉన్నట్లు చెప్పారు. ప్ర‌స్తుతం మాన‌వాళిని వ‌ణికిస్తోన్న కొవిడ్‌ 19తో పోల్చితే నియో కోవ్ కాస్త భిన్నమైనదేన‌ని, అంతేగాక‌ ప్రమాదకరమైనదని తెలిపారు. ప్ర‌తిర‌క్ష‌కాలు, కొవిడ్‌ 19 వ్యాక్సిన్లు ఈ కొత్త వైర‌స్‌ను ఎదుర్కోలేక‌పోవ‌చ్చని వివ‌రించారు.

2012, 2015లో కొన్ని దేశాల్లో వ్యాపించిన‌ మెర్స్‌ కోవ్ ప్ర‌భావంలాగే నియో కోవ్‌తో అధిక మరణాలు సంభ‌విస్తాయ‌ని చెప్పారు. చైనా శాస్త్రవేత్తలు జరిపిన ఫలితాలపై మరోసారి అధ్యయనం చేయాల్సి ఉంద‌ని వెక్టార్‌ వైరస్‌ స్టేట్‌ రీసర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ వైరాలజీ అండ్‌ బయోటెక్నాలజీ నిపుణులు అన్నారు. ఆ వైర‌స్ ప్ర‌స్తుతం జంతువుల్లో మాత్రమే ఉన్నందున దీనిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని చెప్పారు.

More Telugu News