Etela Rajender: రాజ్‌భవన్‌కు వెళ్లకుండా కేసీఆర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు: ఈటల రాజేందర్

  • రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ వెళ్లకపోవడం దారుణం
  • కావాలనే వెళ్లలేదనే విషయం పోచారం మాటలతో అర్థమవుతోంది
  • ప్రజాస్వామ్యవాదులు ఆవేదన చెందే ఘటన ఇదే
KCR insulted constitution by not going to Raj Bhavan says Etela Rajender

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేసీఆర్ హాజరు కాకపోవడం దారుణమని... ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.

కనీసం ఒక సీనియర్ మంత్రి కూడా హాజరుకాకపోవడం మంచి సంప్రదాయం కాదని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులు ఎంతో ఆవేదన చెందే ఘటన ఇదని అన్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కాకపోవడం ద్వారా గవర్నర్ స్థానాన్ని కేసీఆర్ అవమానించారని విమర్శించారు.

ప్రగతి భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడిన మాటలు సరికాదని ఈటల అన్నారు. పోచారం మాటలు రాజ్యాంగం మీద విషం కక్కినట్టు ఉన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ కావాలనే రాజ్ భవన్ కు వెళ్లలేదనే విషయం పోచారం మాటలతో స్పష్టమవుతోందని చెప్పారు.

మరోవైపు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసిన ఘటనపై స్పందిస్తూ... తన మాటలతో జనాలను ఒప్పించే శక్తిని కేసీఆర్ కోల్పోయాడని... అందుకే బీజేపీ నేతలపై దాడులకు  ఉసిగొల్పుతున్నాడని అన్నారు.

More Telugu News