CM Ramesh: బీజేపీ కేంద్ర నాయకత్వం అంతా గమనిస్తోంది: సీఎం రమేశ్

BJP high commmand is observing everything says CM Ramesh
  • కర్నూలు జిల్లా ఆత్మకూరులో బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై దాడి
  • విజయవాడలో ధర్నా నిర్వహించిన బీజేపీ శ్రేణులు
  • ఏపీలో పోలీసు వ్యవస్థ నిద్రపోతోందన్న సీఎం రమేశ్
కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నేతలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. పట్టణంలోని పద్మావతి పాఠశాల వెనుక మసీదు నిర్మాణం విషయంలో వివాదం చెలరేగింది. మసీదును అక్రమంగా నిర్మిస్తున్నారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది.

శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాహనాన్ని వేగంగా నడపడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. గాయపడిన వారిలో ఒకరు మృతి చెందడంతో వ్యతిరేకవర్గం వారు పీఎస్ కు చేరుకుని శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ విజయవాడలో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి.

ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మాట్లాడుతూ బీజేపీ నేతలపై జరిగిన అమానుష దాడికి, వారికి తొత్తుగా వ్యవహరిస్తున్న పోలీసుల వైఖరికి నిరసనగా ధర్నాను నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగా లేదనే విషయాన్ని తాము ముందు నుంచే చెపుతున్నామని తెలిపారు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిద్రపోతోందని విమర్శించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం అన్ని విషయాలను పరిశీలిస్తోందని చెప్పారు. ఆత్మకూరులో జరిగిన ఘటనను బీజేపీ సీరియస్ గా తీసుకుందని తెలిపారు.
CM Ramesh
BJP
Andhra Pradesh

More Telugu News