Anushka Sharma: కోహ్లీ విజ్ఞప్తిని గౌరవించారంటూ ఫొటోగ్రాఫర్లకు అనుష్క కృతజ్ఞతలు

  • దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా 
  • ముంబయి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చిన కోహ్లీ ఫ్యామిలీ
  •  వామికాను ఫొటోలు తీయొద్దన్న కోహ్లీ
  • ఇన్ స్టాగ్రామ్ లో అనుష్క తాజా పోస్టు
Anushka Sharma thanked photographers

ఇటీవల టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడం తెలిసిందే. అయితే టీమిండియా ఆటగాళ్లు ముంబయి ఎయిర్ పోర్టు వద్ద ఉన్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ముద్దుల తనయ వామికాను పలువురు ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో క్లిక్ మనిపించేందుకు ప్రయత్నించారు. అయితే, తమ కుమార్తెను ఫొటోలు తీయొద్దంటూ కోహ్లీ వారిని వారించారు.

ఈ నేపథ్యంలో కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మ స్పందించారు. కోహ్లీ విజ్ఞప్తిని మన్నించి ఫొటోగ్రాఫర్లు ఎవరూ కూడా వామికా ఫొటోలు తీయలేదని వెల్లడించారు. కోహ్లీ మాటను గౌరవించిన సదరు ఫొటోగ్రాఫర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వివరించారు. మీడియాకు, సామాజిక మాధ్యమాలకు దూరంగా వామికాను పెంచాలనుకుంటున్నామని, అందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. వామికా స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పెరగాలని కోరుకుంటున్నామని అనుష్క తెలిపారు.

సోషల్ మీడియాలో తమ కుమార్తె ఫొటోలు పోస్టు చేయని నెటిజన్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్టు చేశారు.

2017లో కోహ్లీ, అనుష్క వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అనుష్క ఈ ఏడాది జనవరిలో వామికాకు జన్మనివ్వడం తెలిసిందే.

More Telugu News