Navjot Singh Sidhu: ఇమ్రాన్‌ఖాన్‌ను అలా పిలిచేందుకు సిగ్గుండాలి: సిద్ధూపై గంభీర్ ఫైర్

  • కర్తార్‌పూర్ కారిడార్‌ను సందర్శించిన సిద్ధూ
  • ఇమ్రాన్‌ను పెద్దన్నగా సంభోదించిన పంజాబ్ పీసీసీ చీఫ్
  • ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ ప్రధానిని అలా పిలవడం సిగ్గుచేటన్న గంభీర్
Gautam Gambhir Slams punjab pcc chief Sidhu

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ 70 సంవత్సరాలుగా పోరాడుతోందని, అలాంటిది ఉగ్రవాదానికి సహకరిస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పెద్దన్నగా పిలవడం సిగ్గుచేట్టన్నారు. నిన్న ఉదయం పాక్ భూభాగంలోని కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్దూ భారత్-పాక్ ప్రధానులు మోదీ, ఇమ్రాన్ ఖాన్ చొరవ తీసుకోవడం వల్లే కర్తార్‌పూర్ కారిడార్ తిరిగి తెరుచుకుందన్నారు.

పంజాబ్ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే రెండు దేశాల సరిహద్దును తిరిగి తెరవాల్సి ఉంటుందన్నారు. పంజాబ్ నుంచి పాకిస్థాన్‌కు 21 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నప్పుడు ముంద్రా పోర్టు మీదుగా 2,100 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం ఏంటని సిద్ధూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ను ఉద్దేశించి ఆయన తనకు పెద్దన్నయ్య లాంటి వారన్నారు.

ఇమ్రాన్‌ను సిద్ధూ పెద్దన్నయ్య అనడంపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ తన కుమారుడినో, కుమార్తెనో సరిహద్దుకు పంపిన తర్వాతే ఉగ్రవాదానికి సహకరిస్తున్న ఇమ్రాన్‌ను పెద్దన్నయ్యగా పిలుచుకోవాలని సూచించారు. సిద్ధూ అలా సంబోధించడం చాలా దారుణమైన విషయమని అన్నారు.

More Telugu News